వైఎస్ జగన్ నామినేషన్ వేసేది అప్పుడే: భారతి చేతికి ఆ బాధ్యతలు
YS Jagan Bus Yatra: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్తోంది. నేటికి ఈ బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది.
కడపలో యాత్రను ఆరంభించిన అనంతరం నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మీదుగా ప్రకాశం మీదుగా పల్నాడు జిల్లాలో అడుగు పెట్టారు వైఎస్ జగన్. 13వ రోజున పిడుగురాళ్లలో బహిరంగ సభలో ప్రసంగించారు.

21 రోజుల పాటు బస్సు యాత్రను నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇంకో వారం రోజుల్లో బస్సు యాత్ర ముగిసే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చేరుకుని అక్కడ బస్సు యాత్ర ముగింపు సభలో ప్రసంగించేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేసింది వైఎస్ఆర్సీపీ.
అనంతరం వైఎస్ జగన్ కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21, 22 తేదీల్లో తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. 22వ తేదీన పులివెందులలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని చెబుతున్నారు. ఈ మేరకు కడప జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది.
నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పర్యటనలను నిర్వహిస్తారు. మే 11వ తేదీన ఎన్నికల ప్రచారానికి తెర పడేంత వరకూ కూడా 175 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళికను జగన్ రూపొందించుకున్నారు.
పులివెందుల నియోజకవర్గం ప్రచార బాధ్యతలను ఆయన భార్య వైఎస్ భారతి తీసుకుంటారు. కడప లోక్సభ పరిధిలోని పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతి విస్తృతంగా పర్యటిస్తారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. నాలుగో దశలో ఏపీ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 18వ తేదీన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆరంభమౌతుంది.












Click it and Unblock the Notifications