మీ అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫ్లాప్ - జగన్కు లేఖ రాసిన ఎంపీ
కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తీరం దాటిన తరువాతా..
మాండోస్ తుఫాన్.. అర్ధరాత్రి మహాబలిపురం వద్ద తీరం దాటిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పుడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పలు చోట్ల మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది.
మీ పరిపాలన ఘోరం..
తుఫాన్ తరువాతి పరిస్థితులను ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం ఆరోపించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రస్తుతం తాను కడపలో ఉన్నానని, ఇవ్వాళ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానని, బాధితులకు ఎలాంటి సహాయ, సహకారాలు అందట్లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
పాదయాత్ర కోసం..
2019 డిసెంబర్ 23వ తేదీన శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించకపోవడానికి నిరసనగా పాదయాత్ర చేపట్టడానికి తాను కడపకు వచ్చానని బినోయ్ విశ్వం చెప్పారు. తుఫాన్ వల్ల పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, ఈ సందర్భంగా తాము ముంపు ప్రాంతాల్లో పర్యటించామని వివరించారు. తాము ఎదుర్కొన్న పరిస్థితులను కలెక్టర్కు వివరించడానికి పలుమార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని అన్నారు.