అన్నొస్తున్నాడని చెప్పండి.. సీఎంను అవుతా..: జగన్, లగడపాటి సర్వే, ఈనాడు పత్రికపై నిప్పులు
కడప: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానల్స్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మండిపడ్డారు. కడపలో జరిగిన వైసీపీ సమర శంఖారావంలో మాట్లాడారు.
తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోతూ తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని (ప్రజలు) ఇచ్చారని తన ధైర్యమని వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ జిల్లా ప్రజలు తనను కొడుకుగా ఆదరించారని చెప్పారు. అందుకే తాను రాష్ట్రమంతా తిరగగలుగుతున్నానని చెప్పారు. మీరు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టే ఈ స్థాయికి వచ్చానన్నారు.

నాకోసం మీరెన్నో భరించారు.. ఇది నా హామీ
ఈ పదేళ్లలో తన పార్టీ వారు, తన వారు ఎన్నో భరించారని జగన్ చెప్పారు. కొందరు కేసులు భరించారు, కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారని, మరికొందరు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారని చెప్పారు. మీకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయినా మీరు ఆదరించారు కాబట్టే రాష్ట్రం దిశగా ఆలోచిస్తున్నానని చెప్పారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలన్నారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.

అవి దొంగ సర్వేలు
వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరి భుజస్కందాలపై ఉందని జగన్ చెప్పారు. ఓట్లను తొలగించేందుకు దొంగ సర్వేలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి ఓటు వేసే వారి ఓట్లు ఎలా తొలగించాలా అని చూస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యం లిస్ట్ చూసుకోవాలని, పేరు లేదని తెలియగానే వెంటనే పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది చంద్రబాబు డబ్బులు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్లలో చేసిందేమీ లేదన్నారు.

అన్న వస్తాడని చెప్పండి
అబద్దాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరని జగన్ అన్నారు. ఆయన రోజుకో సినిమా చూపిస్తారని, ఆయన చెప్పే అబద్దాలకు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 టీవీ ఛానల్స్ ఉన్నాయని బాజా కొడతాయన్నారు. ఎల్లో మీడియా గంటకో డ్రామా చూపిస్తుందన్నారు. చంద్రబాబు తీరును అందరికీ చెప్పాలన్నారు. ఆయన ఇచ్చే రూ.3వేల పింఛన్కు ఎవరు మోసపోవద్దని చెప్పారు. కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అన్న వస్తాడని.. అందరికీ చెప్పండని అన్నారు.

అన్న ముఖ్యమంత్రి కాగానే..
అన్న ముఖ్యమంత్రి కాగానే, మే నెలలో ప్రతి రైతన్నకు డబ్బులు ఇస్తామని అందరికీ చెప్పండని జగన్ తన కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. అన్నొస్తున్నాడని చెప్పండని, పిల్లలను బడికి పంపిస్తే రూ.15వేలు వఇస్తామని చెప్పండని అన్నారు. రైతుకు ప్రతి మేలో రూ.12500 ఇశ్తామని, 45 ఏళ్లు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రూ.75 వేలు ఇస్తామని చెప్పండని అన్నారు. అన్న ముఖ్యమంత్రి అవుతాడు.. అన్న సీఎం కాగానే ఎన్నో పథకాలు అమలు చేస్తాడని అందరికీ చెప్పండని అన్నారు. పొదుపు సంఘాల రుణాలు నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామన్నారు. అవ్వాతాతలకు రెండువేల పింఛన్ రూ.3వేలు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications