వైఎస్ జగన్-చిరంజీవి భేటీపై రోజా ఆసక్తికర కామెంట్స్: ఆయనకు న్యాయం అనిపిస్తేనే..!
కడప: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోలాహలం నెలకొంది. తెలుగు లోగిళ్లు సంక్రాంతి కళను సంతరించుకున్నాయి. భోగి వేడుకలతో మూడు రోజుల సంక్రాంతి పండగ సందడి ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున 3 గంటల నుంచే భోగి వేడుకలు ఆరంభం అయ్యాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు భోగి వేడుకలను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా మూడు రోజుల సంక్రాంతి పండగ ఉత్సవాలకు నాంది పలికారు.

ప్రభుత్వం అండగా ఉందనే ధైర్యం..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు, నటి రోజా తన సోదరుడి ఇంట్లో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కడప జిల్లా సంబేపల్లి మండలంలోని శెట్టిపల్లికి తన కుమారుడు, కుమార్తెతో కలిసి వచ్చారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రాష్ట్ర ప్రజలకు భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని అకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ప్రభుత్వం అండగా ఉందనే ధైర్యం ప్రజల్ల ఉందని అన్నారు.

ప్రతి దానికీ అడ్డుపడటమే అలవాటుగా..
పేద, మధ్య తరగతి కుటుంబాలు, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారని రోజా చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులను తగ్గిస్తే.. అది అక్రమం అంటూ కోర్టుకెక్కారని ధ్వజమెత్తారు. కళాశాలల యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్యలంటూ తెలుగుదేశం పార్టీ విమర్శించిందని గుర్తు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులను నియంత్రించాల్సి వచ్చినప్పుడూ ఇది అన్యాయం అంటూ టీడీపీ నాయకులు రోడ్డెక్కారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాలో విద్యాబోధన చేయడాన్నీ టీడీపీ అడ్డుకుందని చెప్పుకొచ్చారు.

బినామీల కోసం టీడీపీ..
తెలుగుదేశం పార్టీ పేద ప్రజల తరఫున పోరాడట్లేదని, తన బినామీలు, కార్పొరేట్ సంస్థల కోసం పని చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు సినిమా టికెట్ల ధరల తగ్గించితే టీడీపీ నాయకులు సినిమా పెద్దలతో కలిసి వైఎస్ జగన్ను బురదచల్లుతున్నారని మండిపడ్డారు. ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా, వారి అవసరాలకు తగ్గట్టుగా వైఎస్ జగన్ నిర్ణయాలను తీసుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు వాటిని స్వాగతించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

శుభపరిణామంగా..
చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను చిరంజీవి.. వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లడం శుభపరిణామంగా రోజా అభివర్ణించారు. తాము ఎదుర్కొంటోన్న ఇబ్బందులను సామరస్యపూరకంగా పరిష్కరించుకోవడానికి టాలీవుడ్ పెద్దలు వేసిన ఓ ముందడుగు అని వ్యాఖ్యానించారు. తాము ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వివరించే ప్రయత్నం చేయాలే తప్ప.. రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడం సరికాదని చెప్పారు.

కక్షసాధింపుగా భావించడం అర్థరహితం..
వైఎస్ జగన్ ప్రజలపై భారాలను పడకుండా చూస్తున్నారని, దాన్ని కక్ష సాధింపు చర్యగా విమర్శించడంలో అర్థం లేదని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ పెద్దలు చెప్పినవి న్యాయంగా అనిపిస్తే వైఎస్ జగన్ తప్పకుండా వారికి సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పారు. మెజారిటీ ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్ జగన్ ఏ మంచి కార్యక్రమాన్ని చేపట్టినా.. ప్రతిపక్షాలు అడ్డుపడుతుంటాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలనే ఉద్దేశమే తప్ప చిత్ర పరిశ్రమకో లేదా ఏ ఒక్కరికో నష్టం కలిగించాలనేది కాదని అన్నారు.












Click it and Unblock the Notifications