వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై తుది తీర్పు.. ఉత్కంఠత
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై ఉత్కంఠత నెలకొంది. తెలంగాణ హైకోర్టు ఇవ్వాళ ఈ పిటీషన్పై తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కాలేదు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో గడువు కోరారు. కర్నూలులోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. ఆ సమయంలో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారు.

గతంలో విచారణకు హాజరైనప్పుడే తాను అన్ని విషయాలను సీబీఐ అధికారులకు తెలియజేశానని అవినాష్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. వివేకా హత్యకేసులో తన వద్ద ఉన్న సమాచారం మొత్తాన్నీ వారికి వివరించానని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశాలేవీ లేవంటూ ముందునుంచీ చెబుతూ వస్తోన్నారాయన. అనారోగ్యానికి గురైన తల్లిని బాగోగులను చూసుకుంటోన్న పరిస్థితుల్లో విచారణకు హాజరు కాలేననీ సీబీఐ అధికారులకు వివరించారు.
విచారణలో భాగంగా సీబీఐ అధికారులు కర్నూలు కూడా చేరుకున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ పిటీషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె కోలుకునేంత వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సీబీఐ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అధికారులు విచారణకు పిలిచిన ప్రతీసారీ హాజరయ్యానని, పూర్తిగా సహకరించానని గుర్తు చేశారు.
విచారణ సందర్భంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. 25వ తేదీ నాటికి విచారణను ముగించాలనీ సూచించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై విచారణ జరిపిన హైకోర్టు- పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేటి తీర్పు ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications