తాటాకులతో పులివెందుల బస్టాండ్!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల అన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అటువంటి నియోజకవర్గం అభివృద్ధిలో ఏపీలోని ఇతర నియోజకవర్గాలన్నింటికీ ఆదర్శంగా నిలవాలి. కానీ అటువంటి ఊసే కనపడదు. అందుకు ఉదాహరణగా పులివెందుల బస్టాండ్ ను చెప్పుకోవచ్చు.
బస్టాండ్పై ట్రోలింగ్
బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు కూర్చోవడానికి కాదకదా నిలబడటానికి కూడా సౌకర్యం లేదు. అందులోను వేసవికాలం. దీంతో తాటాకులతో పైకప్పు వేయాల్సి వస్తోంది. గట్టిగా గాలివీస్తే అదికూడా ఉంటుందన్న నమ్మకం లేదు. వైఎస్ జగన్ రెడ్డి అధికారం చేపట్టి మూడు సంవత్సరాలైన సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పులివెందుల బస్టాండ్ మీద ట్రోలింగ్ జరుగుతోంది. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ నిర్మించలేని వ్యక్తి రాజధానిని ఎలా కడతారంటూ జగన్పై ట్రోలింగ్ జరుగుతోంది.
అప్పుడేమో గ్రాఫిక్స్ అన్నారు
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందులలో అత్యాధునిక హంగులతో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక డిజైన్ను సిద్ధం చేసింది. కానీ మూడు సంవత్సరాలైనప్పటికీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి నిర్మాణాన్ని గ్రాఫిక్స్ మాయజాలం అంటూ వైసీపీ నేతలు విమర్శించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బస్టాండ్ డిజైన్ను కూడా గ్రాఫిక్స్ గానే భావించి వదిలేసి ఉంటారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతి నిర్మాణాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారని, ఇప్పుడు పరిపాలన మాత్రం అక్కడినుంచే నడుస్తోందని, మూడు సంవత్సరాలైన సందర్భంగా ప్రజలకిచ్చిన కానుకగా పులివెందులలోని తాటాకుల బస్టాండ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఒకవైపు తాటాకుల బస్టాండ్, మరోవైపు చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలోని బస్టాండ్ను పెట్టి ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు. అభవృద్ధి అంటే ఎలా ఉంటుందో కుప్పం బస్టాండ్ను చూసి నేర్చుకోవాలంటున్నారు.
అమరావతి నిర్మాణం దేవుడెరుగు
అమరావతి నిర్మాణం దేవుడెరుగు.. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ కూడా నిర్మించేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారంటూ జగన్ పేరు ట్రోలింగ్కు గురవుతోంది. కోర్టు ఆదేశించినప్పటికీ జగన్ హయాంలో రాజధాని నిర్మాణం జరగుతుందనే నమ్మకం తమకు లేదని, మళ్లీ ప్రభుత్వం మారిన తర్వాతేనని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తుందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.