జగన్ పెద్ద మనసు- బాలుడి వైద్యానికి అప్పటికప్పుడు ఆదేశాలు..!!
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తోన్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. జిల్లాలోని కమలాపురంలో ఈ మధ్యాహ్నం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వాటి విలువ 905 కోట్ల రూపాయలు. కమలాపురంవాసులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోన్న రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కూడా జగన్ శంకుస్థాపన చేశారు.
శని, ఆదివారాల్లో పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు జగన్. కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను శనివారం ప్రారంభించనున్నారు. నియోజకవర్గం పరిధిలోని బలపనూరులో గ్రామ సచివాలయ భవన సముదాయం, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభిస్తారు. పులివెందులలో వైఎస్సార్ మెమోరియల్ పార్క్, రాయాలాపురం బ్రిడ్జి అందుబాటులోకి తీసుకుని వస్తారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి కమలాపురానికి చేరుకున్న వైఎస్ జగన్.. మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఓ బాలుడి వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు అక్కడికక్కడే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆ మొత్తం తక్షణమే బాలుడి తల్లిదండ్రులకు అందేలా చేశారు.
ఆ బాలుడి పేరు నరసింహ. వయస్సు 12 సంవత్సరాలు. స్వగ్రామం భూమాయపల్లి. తండ్రి ఓబులేసు రోజువారీ కూలీ. పని నిమిత్తం రోజూ ఆయన కడపకు రాకపోకలు సాగిస్తుంటారు. ఆయన కుమారుడు సుదీర్ఘకాలంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వీల్ చైర్కే పరిమితం అయ్యారు. ఇవ్వాళ కమలాపురానికి వచ్చిన ముఖ్యమంత్రిని కలిశాడు ఓబులేసు. కుమారుడిని జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు కుమారుడి అనారోగ్యం గురించి వివరించారు.
దీనిపై జగన్ తక్షణమే స్పందించారు. తప్పకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే ఆదేశాలను జారీ చేశారు. నరసింహ వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. నరసింహ కుటుంబానికి వెంటనే లక్ష ఆర్ధిక సహాయం చేయాలని కలెక్టర్కు సూచించారు. బాలుడి వ్యాధికి మెరుగైన చికిత్సకు ఎంత ఖర్చయినా భరించాలని, ఎక్కడైనా సరే వైద్యం చేయించాలని అన్నారు.