కాంగ్రెస్లో చేరడానికి బలమైన కారణం ఉంది: షర్మిల
YS Sharmila: మొన్నటివరకూ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వైఎస్ షర్మిల.. ఏపీలో కొత్త ప్రయాణం మొదలు పెట్టారు. ఏపీ కాంగ్రెస్ అధినేత్రిగా బాధ్యతలను స్వీకరించబోతోన్నారు. ఆదివారం ఉదయం ఆమె విజయవాడలోని కానూరులో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అంతకంటే ముందు- ఆమె తన సొంత జిల్లాకు వెళ్లారు. ఇడుపులపాయను సందర్శించారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ఈ సాయంత్రం ఆమె హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్నారు. పార్టీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె వెంట- మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, మాజీ మంత్రులు ఎన్ రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, రాజంపేట లోక్సభ ఇన్ఛార్జ్ డాక్టర్ నర్రెడ్డి తులసీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అహ్మదుల్లా సహా పలువురు నాయకులు ఉన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం మాట్లాడారు.
పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించడానికి ముందు నాన్న ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాల గురించి వెల్లడించారు వైఎస్ షర్మిల. తన తండ్రి ఆశయాలను సాధించాల్సి ఉందని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి శక్తివంచన లేకుండా పని చేస్తామని చెప్పారు.

కాంగ్రెస్ సిద్ధాంతాలను వైఎస్సార్ ప్రాణసమానంగా భావించేవారని, వాటిని తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను తామందరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోన్నామని అన్నారు. షర్మిలమ్మ రాకతో కాంగ్రెస్కు పూర్వవైభవం దక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications