వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి నివాసంలో విషాదం: పరామర్శిస్తోన్న నాయకులు
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నివాసంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సజ్జల దివాకర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. కొంతకాలంగా సజ్జల దివాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోని సింహాద్రిపురం మండలం ముసాయి పల్లెకు చెందిన సజ్జల దివాకర్ రెడ్డి పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ఆ కుటుంబంలో సజ్జల రామకృష్ణారెడ్డి నాలుగో సంతానం. తన సోదరుడి మరణవార్త తెలియగానే సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. తన షెడ్యూల్ అన్నింటినీ రద్దు చేసుకున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన అమరావతి భూములకు సంబంధించిన అంశాలపై పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది.
దివాకర్ రెడ్డి మరణించిన విషయం తెలియగానే హైదరాబాద్, కడప, పులివెందులల్లో ఉన్న సజ్జల కుటుంబీకులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణా రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. దివాకర్ రెడ్డి మృతిపట్ల ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.