రంగంలోకి ఈటల జమున: బై పోల్లో పోటీ..? రాజేందర్ దూరం, సమీకరణాలు ఇవే..
మాజీమంత్రి ఈటల రాజేందర్ చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. ఆయన బీజేపీలో చేరిక, టీఆర్ఎస్కు రాజీనామా, ఉప ఎన్నికలో పోటీ తదితర అంశాలపై జోరుగా చర్చ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో సంచలన అంశం బయటకు వచ్చింది. హుజూరాబాద్ శాసనసభ్యత్వానికి ఈటల రాజేందర్ రాజీనామా చేశాక.. పోటీ చేయరనే చర్చ జరుగుతుంది. ఆయన స్థానంలో సతీమణీ జమున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఈటల జమున పోటీ..?
హుజూరాబాద్ ఉప ఎన్నికపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ పోటీకి దిగడం లేదనే ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో సతీమణి జమునను పోటీలో నిలిపే యోచనలో ఈటల ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. శాసనసభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి తన రాజకీయ భవితవ్యాన్ని తేల్చుకోవాలని భావించి.. అందుకు ఈటల రాజేందర్ సిద్ధపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈటల బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నా.. దుబ్బాక ఉప ఎన్నిక మాదిరిగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వా..నేనా అన్నట్లు పోటీ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇద్దరికీ ప్రతిష్టాత్మకమే..?
ఉప ఎన్నికల్లో గెలువడం టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకం. ఈటల రాజేందర్కు కూడా ఎన్నిక చావోరేవో తేల్చేదిగా ఉంటుంది. పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కమిటీలు, కార్యకర్తలు ఉన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఆ పార్టీ కమిటీలు ఉన్నాయి. జిల్లా శాఖ అధ్యక్షుడు కూడా హుజూరాబాద్కు చెందిన వారు కావడంతో అక్కడ పార్టీ కొంత బలంగా ఉన్నది.

అభ్యర్థి కోసం అన్వేషణ
ఈటల రాజేందర్, బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిని దింపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతరావు, బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల నియోజకవర్గంలో వరస మీటింగ్లో టీఆర్ఎస్ క్యాడర్ను కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈటల రాజేందర్కు ప్రజల్లో కొంత సానుభూతి ఉన్నా దానిని ఆయన ఓటు రూపంలో పొందకుండా చూసేందుకు టీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటికే వ్యూహాలు రచించింది. ఎంపీటీసీ, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లను కూడగడుతూ ఆయన వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేస్తున్నది.
Recommended Video

పెద్దపల్లిలో ముసలం
ఇదిలా ఉంటే మరోవైపు పెద్దపల్లి నియోజకవర్గం బీజేపీలో ముసలం పుట్టింది. టీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్పై అసంతృప్తి నేతల తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక కోసం వివేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచిర్యాలలో అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించారు. వివేక్ తీరుపై మాజీ మంత్రి బోడా జనార్థన్, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, సోమారపు సత్యనారాయణ కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. వివేక్ తీరు నచ్చక గతంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షపదవికి సోమారపు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications