ఆత్మగౌరవం కోసం కొట్లాట.. జనం కోసం కేసీఆర్తో పోరాడా: ఈటల రాజేందర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వయంపాలన కోసం కొట్లడాం అని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నాం అని చెప్పారు. ఇదీ కుల పంచాయితీ కాదు, టి ఆర్ అహంకారం మీద దెబ్బకొట్టే పంచాయితీ అన్నారు. కెసిఆర్ అహంకారం గెలుస్తుందా? ప్రజలు గెలుస్తారా? తేల్చాల్సిన సమయం వచ్చిందన్నారు. యావత్ తెలంగాణ అంతా హుజురాబాద్ వైపు చూస్తుందని.. రాజేందర్ అన్నని గెలిపించాలని కోరుతున్నారని చెప్పారు. రాచపల్లి లో ఈటెల రాజేందర్ అధ్వర్యంలో రాచపల్లి ట్రాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ పంతాటి కుమార్, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ తో పాటు పెద్ద ఎత్తున బీజేపీ లో చేరారు.
హుజూరాబాద్ లో ఇస్తున్న ప్రతి పైసా మనదేనని ఈటల రాజేందర్ అన్నారు. లిక్కర్ మీద సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందుతాయని చెప్పారు. అగ్గిపెట్టె, సబ్బుబిళ్ళ అన్నింటి మీద పన్నులు కడతామని చెప్పారు. జనం సొమ్ముతో వాళ్ళు సోకు చేస్తున్నారని ఫైరయ్యారు. రైతుల వడ్లు కొనను అంటే కెసిఆర్ తో కొట్లాడిన.. పెన్షన్, రేషన్ కార్డులు ఇవ్వనంటే పోరాడిన.. అని గుర్తుచేశారు.
ఈటల రాజేందర్ గెలిస్తే ప్రజల గొంతుక అవుతాడు అని చెప్పారు. ప్రజల మీద ఈగ వాలకుండా చూసుకుంటాడని.. చైతన్యం కాపాడుకొకపోతే, ప్రశ్నించే వాడిని రక్షించుకొకపోతే సమాజం బానిసత్వం లోకి జారిపోతుందన్నారు. టీఆర్ఎస్ అనేక గాయాలు చేసిందని.. అయినా బయటికి పోలేదన్నారు, భూమి కబ్జా అని బయటికి పంపించారని పేర్కొన్నారు. రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే ఇజ్జత్ ఉన్న వాన్ని కాబట్టి రాజీనామా చేసి మీ దగ్గరకు వచ్చిన అని తెలిపారు. ఇన్ని సంవత్సరాలు కష్ట పడితే ఈ స్థాయికి వచ్చానని... 2018 లోనే వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు.
గాయాలు మానతాయి, కానీ మాటల గాయాలు మానవని ఈటల రాజేందర్ అన్నారు. తనతో ఉన్న వారందరినీ భయపెడుతున్నారని వివరించారు. హుజురాబాద్కి పోలీసుల బెదిరింపులు కొత్తకాదని.. అనేక మంది బిడ్డలను పోగొట్టుకున్న గడ్డ ఇది అన్నారు. తనను ఓడించడానికి ప్రజలకు డబ్బులు పంచుతున్నారని చెప్పారు. తన వల్ల హుజూరాబాద్ కి ఇన్ని పథకాలు.. డబ్బులు వస్తున్నందుకు గర్వ పడుతున్నానని చెప్పారు. రాజీనామా చేసి ప్రజల రుణం తీర్చుకుంటున్నానని పేర్కొన్నారు. కెసిఆర్ తొలి సారి జై భీమ్ అన్నాడని.. కరీంనగర్ లో దళితులతో కలిసి భోజనం చేస్తున్నాడు. మీరు ఎన్ని చేసిన ఇక్కడ ప్రజలకు నా మీద ఉన్న ప్రేమ తగ్గదన్నారు.
అంతకుముందు బీజేపీపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. దేశ ప్రజలను ఆ పార్టీ వంచిస్తోందని చెప్పారు. ఆ పార్టీ ఏ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ప్రశ్నించారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలతోపాటు అన్నింటినీ అమ్ముతున్న బీజేపీ చివరకు గాలిని కూడా అమ్ముతుందేమోనని అన్నారు. మోడల్ స్కూళ్లను నాశనం చేస్తోంది బీజేపీ, కాపాడింది టిఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.