దళితబంధుపై రగడ: అందరికీ ఇవ్వాలని డిమాండ్, ఇళ్లందకుంటలో నిరసనలు
దళిత బంధు పథకం వివాదం రేపుతోంది. హుజురాబాద్ బై పోల్ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో కూడా పథకం అమలవుతోన్న సంగతి తెలిసిందే. అయితే మిగతా చోట్ల తమకు దళిత బంధు కావాలనే నినాదాలు వస్తున్నాయి. కొందరు అయితే ఏకంగా నిరసనకు దిగుతున్నారు. తమకు దళితబంధు పథకం ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు.

అందరికీ బంధు..
కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు స్థానికులు పురుగుల మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దళితులు దగ్దం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కానీ తమపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎమ్మార్పీఎస్ డిమాండ్..
దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిందే. లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరసనలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాదిగ ఇటీవల హెచ్చరించారు. పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్తో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో వరంగల్లోని బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందాలని దయాకర్ మాదిగ అన్నారు. లేదంటే సెప్టెంబరు 5న హుజూరాబాద్లో దళిత గర్జన సభ నిర్వహించి ఆందోళన చేపడతామన్నారు.

డెడ్ లైన్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ ఈ నెల 31లోగా దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హసన్పర్తి మండల కార్యాలయం నిరాహార దీక్ష చేపట్టారు. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్లో 2 వేల కోట్లు ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని దళితులు ఆలోచించాలన్నారు. దళితబంధును ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ముందే ఇవ్వాలి..
ఉప ఎన్నికల కన్నా ముందే రైతు బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాజీపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఎస్సీ అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్, మాలమహానాడు నాయకులు చేపట్టిన దీక్ష రెండో రోజు కొనసాగింది. మాదిగ, మాలమహానాడు నాయకులు హాజరై దీక్షను ప్రారంభించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొక్కల నారాయణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింప చేయాలని ఎస్సీ 59 ఉప కులాల సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ అశోక కాలనీలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ గతం లో దళితలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని లేకుంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

పైలట్ ప్రాజెక్టు
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింప చేస్తారు.

జీవో విడుదల
ఇటు యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళిత బందు పథకం ప్రారంభించారు. దీనిని సంబంధించి ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది. వాసాలమర్రిలో అర్హులైన 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను విడుదల చేశారు. వాసాలమర్రి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ నిధులను విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకానుంది.
Recommended Video

విపక్షాల గుర్రు
దళిత బంధు పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications