ప్రవీణ్ కుమార్పై కేసు.. కోర్టు ఆదేశాలతోనే,, ఎందుకంటే
రాజకీయ పార్టీ పెడతానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారో లేదో.. కేసులు మొదలయ్యాయి. వాస్తవానికి గతంలో జరిగిన ఘటనకు సంబంధించి కేసు ఫైల్ చేశారు. సర్వీస్ ఉండగానే ప్రవీణ్ వీఆర్ఎస్ తీసుకోగా.. అతనిపై కేసు నమోదు చేశారు. ఇదివరకు హిందు దేవతలను ప్రవీణ్ కుమార్ కించపరిచారని వీడియో షేర్ అయిన సంగతి తెలిసిందే.
దానికి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరాధ్య దైవంగా పూజించే హిందు దేవతలను ఆవమానించే రీతిలో విద్వేషపూరితంగా ప్రతిజ్ఞ చేశారంటూ.. న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై 144/2021, సెక్షన్లు 153-ఏ, 295-ఏ, 298 r/w 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.
దోపిడీ, అణచివేతకు గురవుతున్న బహుజనుల పక్షాన నిలబడడానికి తాను రాజకీయాల్లోకి వస్తానని తాజా మాజీ ఐపీఎస్ ప్రవీణ్కుమార్ నిన్న అన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. బహుజనుల అధికారం కోసం జరిగే పోరాటంలో భాగస్వామిని అవుతానని తెలిపారు. తమ పార్టీలో చేరాలని తనను ఇప్పటిదాకా ఎవరూ ఆహ్వానించలేదని వెల్లడించారు.
హుజురాబాద్ బై పోల్ వేళ ప్రవీణ్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు. బహుజనుల కోసం పోరాడుతానని స్వేరో చీఫ్ ప్రకటించారు.