ఆడుకుంటుండగా కాటేసిన పాము.. మేకు అని చెప్పి, నురగలు రావడంతో..
పిల్లలు ఆట పాటలతో మునిగిపోతారు. పెద్దలు అంటే భయపడుతుంటారు. ఆ భయం కొద్దీ వరకే ఉండాలి.. లేదంటే మరొలా ఉంటుంది సిచుయేషన్. అలా ఆడుకుంటున్న పాపకి పాము కాటేసి వెళ్ళింది. దీంతో భయపడిన ఆ చిన్నారి ఆ విషయాన్నే చెప్పలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ ఆడుకునేందుకు పంపరనో.. తిడతారనో కాలికి మేకు గుచ్చుకుందని అబద్దం చెప్పింది. గాయం కూడా పెద్దది కాకవడంతో ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటికీ పాప నోటి నుంచి నురగలు వచ్చాయి. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం లేకపోయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారుకొండ రామవరంలో ఈ ఘటన జరిగింది. ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లి చెందిన బోడ భాస్కర్, భారతి దంపతులకు సంతానం కలగలేదు. దీంతో ఏడేళ్ల క్రితం బంధువుల పాప అఖిలను దత్తత తీసుకున్నారు. ఆదివారం ఎనిమిదో పుట్టినరోజు కావడంతో అమ్మమ్మ ఇంటి వద్ద వేడుక జరుపుకోవాలని అనుకున్నారు. శనివారం కారుకొండ రామవరం వెళ్లారు.
ఆ సాయంత్రం చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఓ పాము వేలిపై కాటేసింది. భయపడిన అఖిల ఇంట్లోకి వెళ్లి కూర్చుంది. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచిపెట్టి మేకు గుచ్చుకుందని అబద్ధం చెప్పింది. గాయం చిన్నదే కావడంతో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అఖిల నోట్లోంచి నురగ రావడంతో వేలిపై పాము కాట్లను గుర్తించి స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లారు.
చివరికి అంబులెన్స్లో ఖమ్మం తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. చివరికి చిన్నారి పుట్టినరోజు ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఇదీ ప్రతీ ఒక్కరినీ కలచివేసింది.