అదేంటి.. అలా... ఇళ్లను కూల్చివేస్తారా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
కొత్తగూడెంలో ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు. ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా ఇళ్లను కూల్చి వేయడం దారుణమని అన్నారు. పాత కొత్తగూడెంలో రైలు పట్టాల పక్కన నిర్మించుకున్న ఇళ్లను రైల్వే అధికారులు కూల్చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం వెళ్లిన ప్రవీణ్ కుమార్ ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు.
ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని... లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
మరోవైపు హుజూరాబాద్లో కొందరికి మద్దతు ఇస్తున్నానని దుష్ప్రచారం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తనపై వస్తోన్న ప్రచారాన్ని విశ్వసించొద్దని కోరారు. అంబేద్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. తనపై కేసులు పెట్టారని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. బహుజన, బడుగు వర్గాల బాగు కోసమే తాను పనిచేస్తానని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని వివరించారు.
Recommended Video
విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి చేసే వారికే తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో వెదజల్లుతున్న డబ్బును వాటికే అందజేయాలని కోరారు. నగదు వెల్లజల్లడం వచ్చే లాభమేమీ లేదని ప్రవీణ్ కుమార్ చెప్పారు.