కరోనా కలకలం: కుప్పంలో వారంపాటు సంపూర్ణ లాక్డౌన్, చిత్తూరులోనే అత్యధిక మరణాలు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో శుక్రవారం(మే 28) నుంచి వారం రోజులపాటు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కుప్పం, రామకుప్పం, గడుపల్లె మండలాల్లో ఈ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
చిత్తూరు జిల్లాలో కొత్తగా 1822 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలోనే అత్యధికంగా 15 మంది మరణించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1.8 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 1225 మంది మృతి చెందగా, 1.58 మంది కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 21,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో కొనసాగుతున్న ఉధృతి
ఏపీలో గడిచిన 24 గంటల్లో 91,120 నమూనాలను పరీక్షించగా.. 18,285 మంది కరోనా బారినపడిటన్లు వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 99 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 10,427కి చేరింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి చెందగా, పశ్చిమగోదావరిలో 14 మంది, విజయనగరంలో 9 మంది, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో 8 మంది చొప్పున, కర్నూలులో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు మరణించారు.
Recommended Video
అదే సమయంలో 24,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 14,24,859కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులున్నాయి.