ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు: కర్నూలులో మరో కరోనా కేసు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్(కొవిడ్-19) అనుమానిత కేసు నమోదైంది. ఇప్పటికే నెల్లూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదవగా.. తాజాగా కర్నూలు జిల్లాలో మరో కొత్త కరోనా అనుమానిత కేసు వెలుగుచూసింది.
జలుబు, గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్న 65ఏళ్ల వృద్ధురాలిని కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగి రక్త నమూనాలను పుణెకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. ఆ వృద్ధురాలు ఇటీవల జోర్డాన్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆమె కుటుంబసభ్యులు, స్థానిక ప్రజలను వైద్యులు అప్రమత్తం చేశారు.
ఏపీలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు
ఇప్పటికే నెల్లూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం అతడు అసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 14 రోజుల చికిత్స అనంతరం కరోనా బాధితుడు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణలోని వరంగల్లో ఒక కరోనా అనుమానిత కేసు నమోదైంది.
కాగా, భారతదేశంలో ఇప్పటి వరకు 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల 4వేల మందికిపైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు కలిపి దాదాపు 1,13,000 మందికి ఈ వైరస్ సోకినట్లు తెలిపింది. 64,000 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. చైనాతోపాటు ఇరాన్, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పలు ఆంక్షలను కూడా విధిస్తున్నాయి.