యువతకు ఏమవుతుంది? పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మరో యువకుడు!!
మారుతున్న జీవన శైలి, ఆరోగ్యంపై యువతలో శ్రద్ధ లేకపోవటం వెరసి యువత అనేక అనారోగ్య సమస్యలతో చిన్నతనంలోనే మృత్యువాత పడుతున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు కూడా వణికిస్తున్నాయి. ముఖ్యంగా యువతలోనే గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. గుండెపోటుతో యువత మరణిస్తున్న వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో యువత ఆరోగ్యం పై అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది. గుండెపోటుతోనే కాకుండా అనేక సమస్యలతోనూ యువత ఆకస్మిక మరణాలు చోటుచేసుకోవడం భయాందోళన కలిగిస్తుంది.
తాజాగా స్నేహితురాలు సోదరి వివాహ రిసెప్షన్లో డాన్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకు చెందిన 21 సంవత్సరాల సత్య సాయి రెడ్డి చెన్నై తురైప్పాకంలో హాస్టల్లో ఉంటూ శ్రీ పెరంబదూరులోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. మొన్న రాత్రి కోయంబేడు నూరడుగుల రోడ్డులో ఉన్న వివాహ మండపంలో జరిగిన స్నేహితురాలి సోదరి వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న సత్య సాయి రెడ్డి, రిసెప్షన్ లో స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వెంటనే అతని చెవి నుండి రక్తం వచ్చింది. దీంతో స్నేహితులు అతడిని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే వైద్యులు అతను మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. అతనికి అంతకు ముందే ఫిట్స్ ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. అప్పటివరకు సంతోషంగా తమతో గడిపిన స్నేహితుడు మృత్యువాత పడడంతో స్నేహితులంతా ఒక్కసారిగా బోరున వినిపించారు. ఇక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసే విచారణ జరుపుతున్నారు.
తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. చక్కగా చదువుకుని, సంతోషంగా బతుకుతున్నాడు అనుకున్న కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరు అవుతున్నారు. తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చి చిన్న వయసులోనే మృత్యు వాత పడుతున్న యువతను చూసి ఇప్పటికైనా ఆరోగ్యం విషయంలో యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నాకేం కాదు అన్న ధోరణి మాని కాస్త అనారోగ్యంగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించటం మేలు.












Click it and Unblock the Notifications