అర్దరాత్రి ఉత్తర్వులతో ఏపీ ప్రభుత్వ సంచలనం .. తొలిగా కర్నూలులో వికేంద్రీకరణకు ఆదేశం
సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఒకపక్క ఉగాది నుండి విశాఖ వేదికగా పాలన సాగించాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టిన సర్కార్ ఏపీ పాలనలో కీలక మార్పులు చెయ్యనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల తరలింపు ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం ఎవరు వద్దన్నా సరే పాలనా వికేంద్రీకరణ చేసి తీరుతానని నిర్ణయం తీసుకుంది . ఇక అందులో భాగంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని వెలగపూడి నుండి కర్నూలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది . ఇకపై ఆ కార్యాలయాలు కర్నూలు నుంచీ పనిచేయనున్నాయి. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిన ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు మండలిలో ఆమోదం పొందనప్పటికీ మూడు రాజధానుల ఏర్పాటుకు అడుగులు వేస్తుందని తాజా పరిణామాలతో సుస్పష్టం .
కర్నూలులో ఏర్పాటు.. అధికారిక ఉత్తర్వులు
అందులో భాగంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని కర్నాలుకు తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతానికి ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సెక్రటేరియట్లో పనిచేస్తున్నాయి. ఇప్పుడీ కార్యాలయాల్ని తరలించి ఈ వారంలోనే వీటి పాలన కర్నూలు నుండి మొదలు పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ కార్యాలయాల ఏర్పాటుకి సంబంధించి శాశ్వత భవనాల్ని గుర్తించేందుకు కర్నూలు కలెక్టర్ కు , రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .
అర్థరాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
అర్థరాత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో కర్నూలు ఉన్నతాధికారులు ప్రస్తుతం కార్యాలయాల ఏర్పాటు పనిలో నిమగ్నమయ్యారు . ఇక కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటవుతున్నట్లే అని తాజా ఉత్తర్వుల ద్వారా, ప్రభుత్వ తాజా చర్యల ద్వారా అర్ధం అవుతుంది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో న్యాయవ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిన నేపధ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు, ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలో సంచలనంగా మారింది .
కర్నూల్ లో వికేంద్రీకరణకు తొలిఅడుగులు
ఒకపక్క మండలి నుండి సెలెక్ట్ కమిటీకి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు పంపినా కమిటీ నిర్ణయం తీసుకునేందుకు గరిష్టంగా మూడు నెలల సమయం పడుతుందని అంచనా . కమిటీ నిర్ణయం మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందనే సీఎం జగన్ భావిస్తున్నారు . ఇక ఈ నేపధ్యంలోనే ఆయన వికేంద్రీకరణకు అడుగులు వేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే జగన్ మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ కొనసాగిస్తున్నారు.