కర్నూలులో వైఎస్ జగన్: విమానాశ్రయంలో స్వాగతం పలికిన బీజేపీ ఎంపీ..!
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కర్నూలుకు వచ్చారు. పత్తికొండకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి వివాహానికి ఆయన హాజరయ్యారు. అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన ఈ ఉదయం కర్నూలుకు చేరుకున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో ఆయనకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు కాటసాని రామ్భూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, బాలనాగిరెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
టీజీ వెంకటేష్ జగన్కు శాలువ కప్పి ఆహ్వానం పలికారు. కొద్దిసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఆయన నేరుగా రాగమయూరి రిసార్ట్కు చేరుకున్నారు. వధూవరులను ఆశీర్వదించారు. టీజీ వెంకటేష్ విమానాశ్రయానికి వెళ్లి మరీ జగన్కు స్వాగతం పలకడం అందరి దృష్టినీ ఆకర్షించింది. జగన్ను కలుసుకోవడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఙతలు తెలియజేయడానికే తాను ఆయనను కలిశానని వివరించారు.

పవన విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆయనను సంప్రదించానని చెప్పారు. పవన విద్యుత్ ప్రాజెక్టులను విస్తరించడానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరానని అన్నారు. నిజానికి-టీజీ వెంకటేష్కు సొంతంగా పవన విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. రాజస్థాన్లో పెద్ద ఎత్తున నెలకొల్పారాయన. ఈ మధ్యకాలంలో రాయలసీమలో విస్తృతంగా ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంతోనే తాను జగన్ను కలిశానని టీజీ వెంకటేష్ తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications