కర్నూలును కలవర పెడుతున్న కరోనా..! అంతుచిక్కని పరిస్థితిపై అధికారుల్లో నెలకొన్న అయోమయం..!!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇక కర్నూలు జిల్లాపై మాత్రం కనికరం లేకుండా కరోనా విరుచుకుపడుతోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కర్నూలు జిల్లాలోనే కరోనా పాజిటీవ్ కేసులు అధికంగా నమోదవుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. కేసులు పెరుగుతున్న తీరుపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. మరో పక్క లాక్ డౌన్ ఆంక్షలను సడలించాలని ఏపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో కర్నూలు జిల్లా అంశం అయోమయంగా మారింది. కేంద్ర బృందం పర్యటన సందర్బంగా కర్నూలు జల్లాలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, మర్కజ్ ప్రభావం ఎంతవరకు ఉంది అనే అంశాలు వెలుగులోకి రానున్నాయి.

అష్టదిగ్బంధనంలో కర్నూలు.. కరోనా తో అతలాకుతలం అవుతున్న ప్రజలు..
ప్రపంచం వ్యాప్తంగా పలు పెద్ద దేశాలు కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా వైరస్ పాజిటీవ్ గా తేలితే అందరికీ చెప్పి వైద్యం చేయించుకుంటున్నారు. అది అందరికీ భరోసానివ్వడమే కాకుండా సమాజానికి ఎంతో శ్రేయస్కరం కూడా. కానీ ఒక ఎమ్మెల్యే తన వాళ్లకు కరోనా సోకితే రహస్యంగా డాక్టరును ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించే ప్రయత్నం చేయడం ఎంత వరకు సంమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఆ క్రమంలో చాలా మందికి కరోనా పాజిటీవ్ గా తేలినట్టు చర్చ జరుగుతోంది. వైద్యం చేసిన డాక్టరు కుటుంబమే చనిపోయింది. కానీ, ఇలాంటి వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

రాష్ట్రంలోనే నంబర్ వన్.. విజృంభిస్తోన్న కరోనా..
అంతే కాకుండా ముందుజాగ్రత్త లేకపోవడం వల్ల కర్నూలు జిల్లాలో విపరీతంగా కరోనా వ్యాపించింది. తాజాగా ఏపీ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం 71 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 1403కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు 1051గా ఉన్నాయి. అయితే, కర్నూలులో అత్యధికంగా ప్రబలింది కరోనా వైరస్. ఆ ఒక్క జిల్లాలోనే 386 కేసుల నమోదు అయ్యాయి. ముఖ్యంగా కర్నూలు పట్టణంలో అత్యధిక కేసులున్నాయి. కర్నూలు తెలంగాణ సరిహద్దు కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దీని పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అనేకమంది తెలంగాణ సరిహద్దు ప్రజలు కర్నూలుతో రకరకాల సంబంధాలు కలిగి ఉన్నవిషయం తెలిసిందే. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రం కూడా కర్నూలు జిల్లాలో ఉండడం విశేషం.

అప్రమత్తమైన తెలంగాణ.. కర్నూలు జిల్లాకు రాకపోకలపై కఠిన ఆంక్షలు..
ఆసుపత్రులు, వ్యాపారం, బంధుత్వాలు, పుణ్యక్షేత్ర దర్శనం.. ఇలా పలు కారణాలతో కర్నూలు జిల్లాకు వెళ్తు వస్తూ ఉంటారు అనేక మంది ప్రజానీకం. ఇక్కడ ఎంత నియంత్రించినా కర్నూలు నుంచి మళ్లీ సోకే ప్రమాదం ఉందని తెలంగాణ బయపడుతోంది. అందుకే ఏపీ సరిహద్దులు మూసేయడంతో పాటు గ్రామగ్రామాన తెలంగాణ ప్రజలు కర్నూలుకు వెళ్లొద్దు అంటూ పోలీసులతో ప్రచారం చేయిస్తున్నారు. కొంతకాలం ప్రజలు సహనంగా ఉండాలని, కర్నూలులో చాలా ఎక్కువ కేసులు పాజిటీవ్ గా ఉన్నాయని, తెలంగాణ ప్రజలు ఏదో ఒక కారణంతో కరోనా బారిన పడడం ఖాయమని తెలంగాణ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చారీ చేస్తోంది. ఇదే అంశాన్ని స్థానిక పోలీసులతో ప్రచారం కూడా చేయిస్తున్నారు అధికారులు.

అంతుచిక్కని వ్యాది విస్తరణ.. అయోమయంలో అదికారులు..
ఇక కర్నూలులో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరుగుతున్న విధానం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వ్యాది నియంత్రణకు ఎంత ప్రయత్నం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని అధికారులు చెప్పుకొస్తున్నారు. స్థానిక ప్రజానికం లాక్ డౌన్ నిబంధనలు కూడా పెద్దగా పాటించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. అందుకే కర్నూలు పట్టణంలో ఇంత దారుణంగా ప్రబలిందనిని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా కర్నూలు ప్రజలతో పాటు అదికారులు ముందు జాగ్రత్త పడితే, మే నెల లోపు కరోనా వ్యాధిని కట్టడి చేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications