జిమ్మిక్కులతో గెలవాలని చూస్తోంది.. టీఆర్ఎస్పై బండి సంజయ్ విమర్శలు
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జిమ్మికులతో, అడ్డదారుల్లో గెలవాలని చూస్తోందని మండిపడ్డారు. పీవీ నర్సింహారావు ఫొటో పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పీవీ నర్సింహారావు ఘాట్ను కూల్చేస్తామన్న పార్టీ తరపున ఎలా పోటీ చేస్తారని వాణిదేవిని ప్రశ్నించారు. సమాజానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో బీజేపీ గెలవకుంటే ముఖ్యమంత్రికి అహంకారం తలకెక్కి ఫామ్హౌస్కే పరిమితం అవుతారన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉపాధ్యాయులు, ఉద్యోగస్తుల పేరు చెప్పుకుని మంత్రి పదవీ పొందారని గుర్తుచేశారు. ఇవాళ వారినే బెదిరించి ఓట్లు రాబట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. సొంత మనుషుల బదిలీలు, ప్రమోషన్ల కోసం జీవోలు మార్చిన సంగతి అందరికీ తెలుసు అని చెప్పారు. ముందు వాటిపై దృష్టిసారించాలని కోరారు. ఆ తర్వాత తమ గురించి మాట్లాడాలని బండి సంజయ్ హితవు పలికారు.
గత కొంతకాలం నుంచి బీజేపీ- టీఆర్ఎస్ మధ్య కౌంటర్ అటాక్ జరుగుతోంది. టీఆర్ఎస్ ఏమీ చేయడం లేదని బీజేపీ.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతల ట్వీట్ వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆ వార్ మరింత ఊపందుకొంది.