మాకు మేమే పోటీ .. మెజార్టీలో పోటాపోటీ ... మెదక్ సభలో కేటీఆర్ సవాల్
హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెదక్ సీఎస్ ఐ గ్రౌండ్ లో జరిగిన టీఆర్ఎస్ సన్నాహాక సమావేశాల్లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని .. అమిత్ షా, మోదీ వచ్చిన ప్రజలు విశ్వసించరన్నారు. మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని .. ఆ పార్టీకి ఓటేస్తే ప్రయోజనం ఉండదని ప్రజలకు చెప్పాలని నేతలకు సూచించారు.
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం : అయోధ్య మధ్యవర్తిత్వానికి మీడియా దూరం ... కారణాలివే ..?
మేం పోటీ
సమావేశంలో శ్రేణులను ఉత్సాహపరిచేందుకు కేటీఆర్ సవాల్ విసిరారు. సిద్దిపేటలో హరీశ్ రావు లక్ష మెజార్టీతో .. గజ్వేల్ లో కేసీఆర్ లక్ష మెజార్టీ .. పటాన్ చెరులో మెజార్టీ లక్ష దాటినందున ... కరీంనగర్ లో ఆ మెజార్టీ దాటి రికార్డ్ బ్రేక్ చేస్తామని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఓ నేత ఇది బావబావమరిది సవాల్ అంటే .. కాదు సీఎం నియోజకవర్గం గజ్వేల్ తో పోటీ అని శ్రేణుల్లో ఉత్సాహ పరిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు కాంగ్రెస్, బీజేపీ పోటీకాదని .. మెజార్టీయే పోటీ అని .. గత రికార్డులను బ్రేక్ చేద్దామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ 100, బీజేపీ 150 ... ప్రాంతీయ పార్టీలే కీ రోల్
పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాదన్నారు. అధికార ఎన్డీఏ కూటమికి 150 సీట్ల కన్నా మించవని చెప్పారు. యూపీఏకు 100-110 సీట్లు రావడం గొప్ప అని .. ఈ విషయాన్ని సర్వేలు చెప్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషిస్తాయన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ 16, మిత్రపక్షం ఎంఐఎం ఒక సీటు గెలిస్తే హస్తినలో చక్రం తిప్పొచ్చని .. నిధులు, ప్రాజెక్టులు తీసుకోవచ్చని సూచించారు.
అందరినీ కలుపుకొని వెళ్దాం
షెడ్యూల్ ఎప్పుడైనా విడుదల కావచ్చు .. ప్రజల్లో ఉండి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. అందరినీ కలుపుకొని పోదాం .. అందరినీ ఓటు అడుగుదాం అని కోరారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో తనపై పోటీచేసినా మహేందర్ రెడ్డికి కూడా రూ.4 లక్షల రైతుబంధు చెక్కు వచ్చిందని .. ఆయనను కూడా ఓటు అడుగాలని శ్రేణులతో సరదాగా మాట్లాడారు.
ఒకప్పుడు బెంగాల్ .. ఇప్పడు తెలంగాణ
ఇదివరకు బెంగాల్ అభివృద్ధి గురించి చర్చించే వారని గుర్తుచేశారు కేటీఆర్. 'ఇవాళ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో .. రేపు దేశం యోచిస్తోంది' అని అనేవారు. కానీ అభివృద్థి పథంలో దూసుకెళ్తోన్న తెలంగాణ .. దేశానికి దిక్సూచిగా మారిందని ఉద్ఘాటించారు. ఓ ఉద్యమకారుడు మంచి పాలనాదక్షుడయ్యాడని కొనియాడారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తనతో చెప్పినట్టు పేర్కొన్నారు.