మారుతిరావు చావు తర్వాత మలుపు.. రహస్యంగా తల్లి దగ్గరికి అమృత.. ఆస్తుల వివరాల సేకరణ?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యలో నిందితుడు మారుతిరావు అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత పరిస్థితులు మెల్లగా మలుపు తిరుగుతున్నాయి. కూతురు అమృతా ప్రణయ్ రహస్యంగా తల్లి గిరిజను కలుసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియా కంటపడకుండా పోలీసుల సాయంతో ఆమె నేరుగా మారుతిరావు ఇంటికే వెళ్లింది.
ప్రణయ్ హత్య కేసు చార్జి షీటులో మారుతిరావుకు రూ.200 కోట్ల ఆస్తులున్నట్లు పోలీసులు నిర్ధారించడం, ఆయన చావుకు ఆస్తి గొడవలు కూడా కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం కావడం, ఆస్తి కోసమే అమృత డ్రామాలాడుతోందని బాబాయి శ్రవణ్ ఆరోపించిన నేపథ్యంలో.. తండ్రి ఆస్తులకు సంబంధించిన వివరాల్ని అమృత సేకరించినట్లుగా కొన్ని ఫొటోలు ప్రచారంలోకి రావడం సంచలనం రేపింది.

ఏడాది బాబును తీసుకుని..
ప్రణయ్ కుటుంబీకులు దళితులు కాదు.. క్రిస్టియన్లు అని నిరూపించడానికి రహస్యంగా ఫొటోలు తీయించిన మారుతిరావు.. వాటి సాయంతో తనపై నమోదైన ఎస్సీ,ఎస్టీ కేసును కొట్టేయించుకోవాలనే ప్రయత్నంలో లాయర్ ను కలిసేందుకు గత శనివారం హైదరాబాద్ వచ్చారు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ రూమ్ నంబర్ 306లో అదే రోజు రాత్రి అనుమానాస్పదరీతిలో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత సోమవారం మిర్యాలగూడలో జరిగిన మారుతిరావు అత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నించగా.. అమృతను బంధువులు అడ్డుకోవడం, ఆమె కారుపై దాడికి యత్నించడంతో తండ్రిని కడచూపు చూసుకోకుండానే ఆమె వెనుదిరిగారు. ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గడంతో తన ఏడాది కొడుకును తీసుకుని అమృత తల్లి దగ్గరికి వెళ్లింది.

ముందు అమృత.. వెనక పోలీసులు..
మారుతిరావు ఆత్మహత్య చేసుకున్న గదిలో ‘గిరిజా క్షమించు, అమృతా అమ్మ దగ్గరికి రా' అని రాసున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తండ్రి అత్యక్రియలనాడే తల్లిని కలిసేందుకు అమృత విఫలయత్నం చేసింది. దీంతో శనివారం సాయంత్రం పోలీసుల సాయంతో మీడియా కంట పడకుండా ఆమె తల్లి గిరిజను కలిసింది. ఒక కారులో అమృత తన కొడుకుతో వెళ్లగా.. వెనుక మరో కారులో పోలీసులు ఎస్కార్టుగా బయలుదేరిన దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. అమృత తన తల్లిని కలవడంపై కుటుంబీకులెవరూ స్పందించలేదు.

భర్తల్ని కోల్పోయిన తల్లీకూతుళ్లు తొలిసారి..
దళితుడైనందుకు ప్రణయ్ బలైపోగా, పరువు కోసం పాకులాటలో మారుతిరావు కూడా ప్రాణాలు కోల్పోయాడు. భర్తల్ని కోల్పోయిన తర్వాత తొలిసారి కలిసిన ఆ తల్లికూతుళ్లు పట్టరాని భావోద్వేగానికి లోనయ్యారని, సుమారు పావుగంట పాటు అమృత అక్కడే గడిపిందని, ఏడాది వయసున్న మనవణ్ని గిరిజ దగ్గరికి తీసుకున్నారని, ఆ తర్వాత పోలీస్ సెక్యూరిటీ మధ్య అమృత తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారని తెలిసింది. తండ్రి ఆస్తిలో చిల్లిగవ్వ కూడ వద్దని, కూడా ఉంటానంటే తల్లిని కూడా తానే చూసుకుంటానని అమృత చెప్పిన తర్వాత కూడా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..

శ్రవణ్ కు తెలియకుండా..?
మిర్యాలగూడలోని నాగార్జుననగర్ కాలనీలో మారుతిరావుకు చెందిన ఫ్లాట్స్ ను కూతురు అమృత పరిశీలించినట్లుగా కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా, వెనకాలే కూర్చున్న అమృత.. ఆ స్థలాలను ఫొటోలు తీస్తుండగా.. స్థానికులు కొందరు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించినట్లు మిర్యాలగూడలో పలు వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన వాస్తవాలు తెలియాల్సిఉంది. అమృత తల్లిని కలిసిన సందర్భంలోగానీ, ఫ్లాట్స్ న ఫొటోలు తీసినట్లుగా చెబుతున్న సమయంలోగానీ బాబాయి శ్రవణ్ ఎక్కడున్నారనేదీ వెల్లడికాలేదు. ప్రణయ్ హత్య కేసులో ఏ2గా ఉన్న శ్రవణ్ గత వారం కోర్టుకు కూడా హాజరుకాలేదు. ఈనెల 23న తదుపరి విచారణకైనా ఆయన న్యాయస్థానికి వెళతారా? లేదా? అనేదానిపై స్పష్టత రాలేదు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ..
ప్రణయ్ హత్యకు సంబంధించి పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, నల్లొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో గతవారం ట్రయల్ ప్రారంభమైంది. ట్రయల్ కంటే ముందే కూతుర్ని తనవైపుకు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం, ఇక శిక్ష తప్పదని అర్థంకావడంతోనే మారుతిరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఆయన లాయర్ అభిప్రాయపడ్డారు. మిర్యాలగూడ, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో మారుతిరావుకు రూ.200 కోట్ల ఆస్తులున్నట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. అటు హైదరాబాద్ లో మారుతిరావు అనుమానాస్పద మృతి కేసుపైనా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications