ఐటీ రైడ్స్: మంత్రి జగదీశ్ పీఏ ఇంట్లో, భారీగా నగదు
మునుగోడు బై పోల్ ప్రచార పర్వం తుది దశకు చేరింది. రేపు సాయంత్రంతో క్యాంపెయిన్ ముగియనుండగా.. ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పీఏ డ్రైవర్ భారీ నగదుతో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఇటు వెంటనే ఐటీ సోదాలు కూడా జరిగాయి. మునుగోడు బై పోల్కు సంబంధించి మంత్రి జగదీశ్ రెడ్డి సహచరుల వద్ద రైడ్ జరిగింది.
జగదీశ్ పీఏ ఇంట్లో
మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. నల్లగొండలో గల ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఐటీ అధికారుల బృందం చేరుకుంది.. అక్కడ సోదాలు చేస్తున్నారు. భారీగా నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్ తెలుస్తోంది. ఎంత మొత్తం అనే విషయం తెలియరాలేదు.
అన్నీ తానై చూస్తుండగా..
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను టీఆర్ఎస్ హై కమాండ్ జగదీశ్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలను జగదీశ్ రెడ్డి అతిక్రమించారని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ విషయం అలా ఉండగా ఆయన పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.
48 గంటలు బ్యాన్.. ఆ తర్వాత
ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయనపై చర్యలు తీసుకునేందుకు కారణమైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవని ఆయన కామెంట్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై మంత్రి జగదీశ్ రెడ్డి వివరణ ఇచ్చారు. మంత్రి వివరణపై ఎన్నికల సంఘం అసంతృప్తి చెందింది. ఎన్నికకు సంబంధించి ఆయనపై ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు సభలు, సమావేశాలు, ర్యాలీలకు హాజరు కావొద్దని స్పష్టం చేసింది. మీడియాకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ సాయంత్రం నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అదీ ముగిసిందో లేదో.. ఇప్పుడు ఐటీ దాడులు చేసింది.