లక్ష మందితో కేసీఆర్ సభ.. ముమ్మర ఏర్పాట్లు
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకెళుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక అభ్యర్థి భగత్ సంగతి సరే సరి.. ఈ క్రమంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారు.
సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 17న ఉండగా.. ప్రచార గడువు ముగియడానికి దాదాపు 24 గంటల ముందు జరిగే సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. ఓవైపు ప్రచారంలో భాగస్వాములు అవుతూనే, మరోవైపు కేసీఆర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
హాలియా సభలో సీఎం కేసీఆర్ చేసే ప్రసంగం టీఆర్ఎస్ ప్రచారంలో కీలకం అవుతుందని గులాబీ దళం భావిస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే, నియోజకవర్గం నలుమూలల నుంచి కేసీఆర్ సభకు పెద్దఎత్తున జనాలను తరలించాలనే సందేశాలు కింది స్థాయికి వెళ్లాయి. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం ద్వారా పోలింగ్ నాటికి టీఆర్ఎస్పై నియోజకవర్గంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ ముఖ్యనేతలు వ్యక్తం చేస్తున్నారు.