కాంగ్రెస్ను చంపి ఎమ్మెల్యేలను కొన్నారు.. పులి లాంటి బీజేపీలో చేరా: రాజగోపాల్ రెడ్డి
మునుగోడు బై పోల్ మరింత హీటెక్కింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో కాల్తో కలకలం రేగింది. దానిపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం షోకాజు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కేసీఆర్ కు అహంకారం ఎక్కువైందని అన్నారు.
ఉద్యమకారుడని చెప్పుకునే కేసీఆర్ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలను ఎలా కొంటారని ప్రశ్నించారు. సాధు జంతువులాంటి కాంగ్రెస్ పార్టీని చంపి 12 మంది ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. అందుకే తాను పులి లాంటి బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్లలో జరిగింది శూన్యం అని పేర్కొన్నారు.