యాదాద్రి ఆలయ సప్త రాజగోపుర నిర్మాణాలు పూర్తి.. జీవకళ ఉట్టిపడేలా శిల్పకళా సృష్టి
తెలంగాణ రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం అయిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా నిర్మించిన సప్త రాజ గోపురాలు అద్భుత శిల్పకళా ప్రతిభకు దర్పణంగా నిలుస్తున్నాయి. సర్వాంగ సుందరంగా శిల్ప కళాకారులచే తీర్చిదిద్దబడ్డాయి.
సప్త రాజగోపురాలు పూర్తి .. ప్రధాన సుదర్శన విమాన రాజ గోపుర నిర్మాణ ప్రశస్తి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా నూతన ప్రధానాలయంలో సప్త రాజగోపురం నిర్మాణాలు పూర్తయ్యాయి. సప్తగోపుర నిర్మాణాల్లో అత్యంత ప్రధానమైన సుదర్శన విమాన రాజగోపుర నిర్మాణం చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఆలయ విస్తరణలో భాగంగా గర్భాలయంపై సుదర్శన విమాన రాజగోపురాన్ని నిర్మించి దీనిపై సుదర్శన చక్ర ఏర్పాటు చేసిన అనంతరం పెద్ద ఎత్తున కుంభాభిషేకాన్ని చేపడతారు. ఐదంతస్తుల్లో 50 వేల టన్నుల కృష్ణశిలలతో ఈ రాజగోపురాన్ని నిర్మించారు. దీంతో స్వామి, అమ్మవార్లు కొలువైన గర్భాలయంపైన గల సుదర్శన రాజగోపురం సైతం భక్తుల మొక్కలను అందుకోనుంది.
గర్భాలయంపైన గల సుదర్శన విమాన రాజగోపురంపై దేవతా విగ్రహాలలో జీవకళ ఉట్టి పడుతుంది. 10 ద్వారపాలకుల విగ్రహాలు, ప్రతి అంతస్తులో రెండు చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 10 విగ్రహాల ఏర్పాటు చేశారు.
అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం .. రాజగోపురాల నిర్మాణ నైపుణ్యం
ప్రధానాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జీయర్లు, ఆచార్యులు, వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వయంభువుల ప్రతిష్ఠ తర్వాత రాజగోపురంపై కలశాలను, సుదర్శన చక్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పూర్తయిన రాజగోపురాలు యాదాద్రికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తున్నాయి. యాదగిరీశుడి ప్రధానాలయాన్ని నాలుగువైపులా ఐదంతస్తుల రాజగోపురాలు, ఈశాన్యదిశలో భక్తులు ప్రధానాలయంలోకి ప్రవేశించే మార్గంలో త్రితల రాజగోపురం, గర్భగుడిపై ఐదంతస్తుల విమానగోపురం, పడమటి దిశలో సప్తతల మహారాజగోపుర శిలా నిర్మాణాలు శిల్పుల ప్రతిభకు అద్దం పట్టడమే కాకుండా, యాదాద్రి దేవాలయాన్ని అంతర్జాతీయంగా ప్రత్యేక స్థానంలో నిలబెట్టే లాగా కనువిందు చేస్తున్నాయి.
గర్భగుడిపై సువర్ణ తాపడం చేసే పంచతల విమాన గోపురం
గర్భగుడిపై నిర్మించిన పంచతల విమాన గోపురానికి బంగారు తాపడం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా చిన్న రాజగోపురాల నిర్మాణం జరగాల్సి వుంది. వైటీడీఏ ప్రస్తుతం ఆ పనుల్లో బిజీ గా వుంది. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చాలా విశిష్టమైన దేవాలయంగా యాదాద్రికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో యాదాద్రి కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేలా దీని పైన దృష్టి సారించడం విశేషం.