కేంద్రం నుంచి గుడ్న్యూస్: ఆ అనుమతులు అవసరం లేదంటూ: క్లియరెన్స్కు తొలగిన అడ్డంకి
నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మరో కీలక ముందడుగు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తీపి కబురు అందించినట్టే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులను కొనసాగించడానికి బ్రేక్ వేస్తూ ఇచ్చిన స్టేను ఇదివరకే ఎత్తివేసిన నేషనల్ గ్రీన్ ట్రుబ్యునల్ (ఎన్జీటీ) మరో క్లియరెన్స్కు పచ్చజెండా ఊపవచ్చని తెలుస్తోంది. ఈ పథకం నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్రానికి నోటీసులు..
రాయలసమీ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతల అవసరం ఉందా? లేదా? అంటూ ఈ నెల 13వ తేదీన ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ పథకాన్ని కొనసాగించడానికి ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్జీటీకి అఫిడవిట్ను సమర్పించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లబోదని స్పష్టం చేసింది. పోతిరెడ్డి పాడు విస్తరణలో భాగంగా మాత్రమే ఈ కొత్త పథకం నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పూనుకొందని వివరించింది.

వచ్చే నెల 11న తుది తీర్పు..
ఎత్తిపోతల పథకంపై విధించిన స్టేను ఎత్తివేసిన సమయంలోనే ఎన్జీటీ.. కేంద్రానికి ఈ నోటీసులను జారీ చేసింది. వచ్చేనెల 11వ తేదీ వరకు కేంద్రానికి సమయం ఇచ్చింది. అయినప్పటికీ.. రెండువారాల వ్యవధిలోనే కేంద్రం తన అభిప్రాయం ఏమిటనేది తేల్చిచెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఇక ఆగస్టు 11వ తేదీన వెలువడే తుది తీర్పుపై ఆశలు చిగురించినట్లు జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

తుది తీర్పు తరువాత
తొలి విడతలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను నిర్వహించుకోవడానికి ఎన్జీటీ అవకాశాన్ని ఇచ్చిందని, పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమని అంటున్నారు. తుది తీర్పు వెలువడిన తరువాత ఈ పథకం నిర్మాణ పనులు ఊపందుకుంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పథకం కొత్తగా నిర్మించ తలపెట్టినది కాదని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి అదనపు కోటా నీటిని దీనికోసం వినియోగించుకోవట్లేదని, పాత ప్రాజెక్టులోనే కొద్దిపాటి డిజైన్ మార్పులను మాత్రమే కొత్తగా ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

సీమ జిల్లాల్లో 19 లక్షల హెక్టార్లకు నీటి సరఫరా కోసం
కృష్ణా జలాలపై నిర్మించిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించడానికి ప్రతిపాదనలను రూపొందించిన విషయం తెలిసిందే. దీన్ని నిర్మించాల్సి వస్తే.. పెద్ద ఎత్తున పర్యావరణానికి హాని కలుగుతుందని, ఎగువ ప్రాంతంలో ఉన్న తమకు అన్యాయం జరుగుతందంటూ తెలంగాణలోని నారాయణపేటకు చెందిన ఓ రైతు ఎన్జీటీలో పిటిషన్ వేశారు. ఈ పిటీషన్పై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. ఇదివరకు స్టే ఇవ్వగా.. ఈ నెల 13వ తేదీన దాన్ని ఎత్తేసింది. ప్రారంభ పనులకు అనుమతి ఇచ్చింది. తాజాగా కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులపై స్పష్టత రావడం మరో అడుగు ముందుకు పడినట్టయింది.
Recommended Video

వృధా జలాలను వినియోగించుకోవడానికే..
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీకి కేటాయించిన కోటా జలాలను సమర్థవంతంగా, సద్వినియోగం చేసుకోవడం, సముద్రంపాలవుతోన్న వృధా నీటిని మళ్లించడానికి మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి రూపొందించిన సమగ్ర బ్లూ ప్రింట్ను గ్రీన్ ట్రిబ్యునల్కు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు అనుగుణంగా.. ఆ ప్రభుత్వ అంగీకారంతో కేటాయించిన కోటా నీళ్లతోనే తాము ఈ ప్రాజెక్టును నిర్మించడానికి ప్రతిపాదనలను రూపొందించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications