ఆనందయ్యపై ముప్పేటదాడి: మందు పంపిణీని అడ్డుకోవాలని పంచాయతీ తీర్మానం: జేసీ నోటీసులు
నెల్లూరు: ప్రాణాంక కరోనా వైరస్పై ప్రభావాన్ని చూపేలా ఆయుర్వేద మందును పంపిణీ చేస్తోన్న ఆనందయ్య.. చిక్కుల్లో పడ్డారు. వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై సైతం తాను తయారు చేస్తోన్న మందు పని చేస్తోందంటూ చెప్పుకొంటోన్న దశలో- ఆయన ఏకంగా పంపిణీని నిలిపివేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు. రెండు రోజులుగా స్థానికులు ఈ మందు పంపిణీని అడ్డుకుంటుండటం, కృష్ణపట్నం గ్రామ పంచాయతీ ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం.. చివరికి నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా నోటీసులను జారీ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మందు పంపిణీపై వ్యతిరేకత..
ఆనందయ్య కరోనా వైరస్ మందును స్వీకరించడానికి చాలామంది కృష్ణపట్నానికి చేరుకుంటోన్నారు. ఏడాదిన్నరగా కృష్ణపట్నం ఇదే తాకిడిని ఎదుర్కొంటోంది. పొరుగు రాష్ట్రాల నుంచీ ప్రత్యేకంగా వాహనాలు వేసుకుని మరీ కృష్ణపట్నం వస్తోన్నారు. వారివల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈ మందు పంపిణీని నిలిపివేయాలంటూ రెండు రోజుల కిందటే గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆనందయ్య ఇంటి వద్ద ధర్నా చేశారు.

తీవ్ర పరిణామాలు తప్పవంటూ..
ఎక్కడెక్కడి నుంచో అంబులెన్సుల్లో కరోనా వైరస్ బాధితులు తమ గ్రామానికి వస్తుండటం వల్ల తాము అనేక పాట్లు పడుతున్నామని చెబుతున్నారు. లేని వ్యాధులు ముసురుకునే ప్రమాదం పొంచివుందని ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. తమ డిమాండ్ను కాదని ఆనందయ్య మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. వందలాదిమంది కృష్ణపట్నం గ్రామస్తులు ఆనందయ్య రెండు రోజులుగా నిరసనలను నిర్వహిస్తోన్నారు.

గ్రామంలో అనారోగ్య వాతావరణం
ఆనందయ్య మెడిసిన్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తోండటం వల్ల గ్రామంలో అనారోగ్యకర వాతావరణం నెలకొందని, తమకూ కరోనా సోకుతుందని గ్రామస్తులు భయాందోళనలు కృష్ణపట్నంలో వ్యక్తమౌతోన్నాయి. ఒమిక్రాన్కు మందు కనిపెట్టినట్టు ఆనందయ్య అసత్య ప్రచారం చేస్తోన్నారని మండిపడుతున్నారు. తాము అనారోగ్యం బారిన పడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనారోగ్యానికి గురయ్యారనేది గ్రామస్తుల వాదన.

గ్రామ పంచాయతీ జోక్యం..
ఈ పరిస్థితుల్లో కృష్ణపట్నం గ్రామ పంచాయతీ జోక్యం చేసుకుంది. తక్షణమే ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు చేస్తోన్న డిమాండ్కు స్పందించింది. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు అత్యవసరంగా సమావేశమైంది. ఆనందయ్య మందు పంపిణీకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. కరోనా వైరస్ మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంత వరకూ గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు ఉండబోవని తేల్చి చెప్పింది.

జాయింట్ కలెక్టర్ నోటీసులు
రెండు రోజులుగా కృష్ణపట్నంలో నెలకొన్న పరిణామాలపై జిల్లా పాలన అధికారులు సైతం స్పందించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఆనందయ్యకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్..ఆనందయ్యకు నోటీసులు ఇచ్చారు. ఒమిక్రాన్పై మందు ప్రభావం చూపుతుందా? లేదా? అనే విషయంపై శాస్త్రీయబద్ధమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికారుల నుంచి మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో వెల్లడించాలని, వారం రోజుల్లోగా పూర్తి సమాచారాన్ని అందజేయాలని అన్నారు. సరైన ఆధారాలు, అనుమతులను చూపించకపోతే చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications