చంద్రబాబు ఇంటికి బ్రాహ్మణిని కోడలిగా పంపించిన బాలకృష్ణ మనసులో బాధపడుతున్నాడు
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి- తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై ఘాటు విమర్శలు సంధించారు. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోమోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. తాను కాళ్లు పట్టుకున్నా ఎన్టీ రామారావు తన మాట వినలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారాయన. వియ్యంకులిద్దరూ ఒక షోలో కూర్చుని అన్నీ అబద్ధాలు మాట్లాడుకున్నారని ఆరోపించారు.
భగవత్ స్వరూపుడు..
చంద్రబాబు నైజం కాళ్లు పట్టుకుని లాగేయడమే గానీ.. కాళ్లపై పడే మనస్తత్వం కాదని నల్లపరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఎన్టీ రామారావు ఉంటే ఆయన కాళ్లు పట్టుకుని లాగేశాడని స్పష్టం చేశారు. హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ వద్ద పెద్దాయనపై చెప్పులు, రాళ్లు వేసిన ఘనత చంద్రబాబుదేనని గుర్తు చేశారు. తామెవరం నిజంగా దేవుడిని చూడలేదని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్టీ రామారావులో భగవంతుడిని చూసుకుంటారని అన్నారు. ఎన్టీఆర్ది పసిబిడ్డ మనస్తత్వమని వ్యాఖ్యానించారు.
బాలకృష్ణకు తప్పట్లేదు..
చంద్రబాబుది దీనికి భిన్నమైన మనస్తత్వమని, అత్యంత నీచుడని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. నరనరాన విషాన్ని నింపుకొన్న వ్యక్తి అని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. నమ్మి ఆడబిడ్డను ఇచ్చిన మామ ఎన్టీఆర్ గొంతు కోశాడని గుర్తుచేశారు. చంద్రబాబు ఇంటికి కూతురిని కోడలిగా పంపించినందు వల్ల బాలకృష్ణకు తప్పట్లేదని వ్యాఖ్యానించారాయన. బాలకృష్ణకు మనసులో బాధ ఉన్నా కూతురిని ఇచ్చాడు కాబట్టి తప్పట్లేదని అన్నారు.
ఎన్టీఆర్కు ద్రోహం..
వైస్రాయ్ హోటల్లో జరిగిన కుట్రలో బాలకృష్ణకు కూడా భాగం ఉందని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు ఎన్టీఆర్కు ద్రోహం చేసిన వారేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్లందరూ కలిసి ఎన్టీ రామారావు భజన చేస్తోన్నారని ధ్వజమెత్తారు. ఎన్టీ రామారావు కాళ్లు పట్టుకున్నానని చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధమని తేల్చేశారు. వీళ్లందరూ కలిసి ఎన్టీ రామారావును చంపేశారని, ఆ శాపాలు ఖచ్చితంగా తగులుతాయని అన్నారు. అంతకుఅంత అనుభవిస్తారని చెప్పారు.
రెండెకరాల నుంచి..
చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడికి అప్పట్లో రెండెకరాల పొలం మాత్రమే ఉండేదని, ఇప్పుడు అదే చంద్రబాబు నాలుగు లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అని విమర్శించారు. ఎక్కడెక్కడో విలాసవంతమైన భవనాలను నిర్మించుకున్నాడని, ఇంతటి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని నల్లపరెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు మానసికంగా ఎన్నో బాధలను అనుభవించడానికి నాటి పాపాలే కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, జనసేన మూత పడేవేనని నల్లపరెడ్డి తేల్చిచెప్పారు.