తాడేపల్లికి కోటంరెడ్డి- జగన్తో భేటీపై అందరి దృష్టి..!!
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రిని కలుసుకోనున్నారు. కొంతకాలంగా జిల్లా అధికార యంత్రాంగంపై తరచూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో కోటంరెడ్డిని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కోటంరెడ్డికి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తుంటారు. ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. రోజూ వార్తల్లో నిలుస్తుంటారు. తన వైఖరితో అధికార యంత్రాంగానికి చుక్కలు చూపిస్తుంటారు. పనులు చెయ్యని అధికారులపై ఎలాంటి మొహమాటం లేకుండా, నిర్భయంగా, బాహటంగా విమర్శనాస్త్రాలను గుప్పించడానికీ వెనుకాడరు.

అధికారుల వైఖరిని నిరసిస్తూ కొద్దిరోజుల కిందటే తన నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంట మురుగునీటి కాల్వలో బైఠాయించిన విషయం తెలిసిందే. మురుగునీటి కాల్వ సమస్యను పరిష్కరించాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తోన్నామని, అయినప్పటికీ అధికారులు ఏదో ఒక సాకుతో దాటవేస్తోన్నారంటూ కోటంరెడ్డి మండిపడ్డారు. రైల్వే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాల్సి ఉందంటూ అప్పట్లో ధ్వజమెత్తారు.
తాజాగా- జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలోనూ ఆయన అధికార యంత్రాంగంపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పైనా విమర్శలు గుప్పించారు. నిధులను సకాలంలో మంజూరు చేయట్లేదంటూ ఆరోపించారు. తన నియోజకవర్గం పరిధిలో రోడ్ల మరమ్మతు, ఇతర అభివృద్ధి పనులు స్తంభించిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల మధ్య కోటంరెడ్డిని వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకోవడం ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గానికి విడుదల చేస్తోన్న నిధుల లోటు లేనప్పటికీ- ఎందుకు అసంతృప్తి గళాన్ని బాహటంగా వినిపించాల్సి వచ్చిందనే విషయంపై జగన్ ఆరా తీయనున్నారని అంటున్నారు. దీనికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందని సమాచారం. తన వ్యాఖ్యలపై వైఎస్ జగన్ కు కోటంరెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారనేది చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications