వైఎస్ జగన్కు చికాకు పెడుతున్న మరో ఎమ్మెల్యే: కలవాలంటూ ఫోన్ కాల్..!!
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తుంటారు. ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. రోజూ వార్తల్లో నిలుస్తుంటారు. తన వైఖరితో అధికార యంత్రాంగానికి చుక్కలు చూపిస్తుంటారాయన. పనులు చెయ్యని అధికారులపై ఎలాంటి మొహమాటం లేకుండా, నిర్భయంగా, బాహటంగా విమర్శనాస్త్రాలను గుప్పించడానికీ వెనుకాడరు.
కొద్దిరోజుల కిందటే తన నియోజకవర్గం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన కోటంరెడ్డి.. ఉమ్మారెడ్డి గుంట మురుగునీటి కాల్వలో బైఠాయించిన విషయం తెలిసిందే. ఉమ్మారెడ్డిగుంట మురుగునీటి కాల్వ సమస్యను పరిష్కరించాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తోన్నామని, అయినప్పటికీ అధికారులు ఏదో ఒక సాకుతో దాటవేస్తోన్నారంటూ కోటంరెడ్డి మండిపడ్డారు. రైల్వే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాల్సి ఉందంటూ అప్పట్లో ధ్వజమెత్తారు.
ఇప్పుడు తాజాగా- జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలోనూ ఆయన తనదైన శైలిలో అధికార యంత్రాంగంపై మండిపడ్డారు. వారి వైఖరిని తప్పుపట్టారు. ఇప్పుడాయన ఓ అడుగు ముందుకేశారు. ఏకంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పై విమర్శలు గుప్పించారు. నిధులను సకాలంలో మంజూరు చేయట్లేదంటూ ఆరోపించారు. తన నియోజకవర్గం పరిధిలో రోడ్ల మరమ్మతు, ఇతర అభివృద్ధి పనులు స్తంభించిపోవడానికి ఆయనే కారణమంటూ ధ్వజమెత్తారు.
ఇది కాస్త- వైఎస్ జగన్ ను చీకాకులకు గురి చేసినట్టయింది. తనను కలవాలంటూ కోటంరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించినట్లు చెబుతున్నారు. నియోజకవర్గానికి విడుదల చేస్తోన్న నిధుల లోటు లేనప్పటికీ- ఎందుకు అసంతృప్తి గళాన్ని బాహటంగా వినిపించాల్సి వచ్చిందనే విషయంపై జగన్ ఆరా తీయనున్నారని అంటున్నారు. దీనికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందని సమాచారం.
మొన్నటికి మొన్న తిరుపతి జిల్లా వెంకటగిరి శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి- రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి కూడా నిధులు ఉండట్లేదంటూ ఆయన పేర్కొన్నారు. తాను శాసన సభ్యుడినా? కదా? అనే విషయంపై తనకే అనుమానంగా ఉందంటూ మాట్లాడారు ఆనం. ఇప్పుడు కోటంరెడ్డి అదే తరహాలో మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.