హోటల్లో భార్య, ఇద్దరు పిల్లలు సహా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని ఒక హోటల్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ కు చెందిన కొత్తకోట సూర్యప్రకాశ్ అనే వ్యక్తి... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే, భార్య ప్రత్యూష, ఇద్దరు పిల్లలతో... 15 రోజులుగా నిజామాబాద్ హోటల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నలుగురు హోటల్ గదిలో విగతజీవులుగా కనిపించారు.
భార్య, పిల్లలు పురుగుల మందు తాగి చనిపోగా.... సూర్యప్రకాశ్ ఉరివేసుకుని చనిపోయాడు. మొదట భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించిన సూర్యప్రకాశ్... అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సూర్య ప్రకాశ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. అయితే, వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో యువదంపతుల ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు గ్రామ శివారులోని పులివాగులో దూకి ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మునగపాడు గ్రామానికి చెందిన పణితి తిరుపతిరావు(32)కు విజయవాడకు చెందిన కుసుమ(28)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. తిరుపతిరావు గుంటుపల్లి గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం షాపులో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు.శుక్రవారం గొల్లపూడిలోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన తిరుపతి రావు, కుసుమలు.. అదే రోజు సాయంత్రం మునగపాడు గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
రాత్రి 7 గంటల సమయంలో గడ్డమణుగు గ్రామ శివారులోని పులివాగు వద్దకు చేరుకున్నారు. ద్విచక్రవాహనాన్ని వంతెనపై ఉంచి భార్యాభర్తలు ఇద్దరూ వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.