విషాదం: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో యువ వైద్యురాలు శ్వేత మృతి
నిజామాబాద్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన చోట చేసుకుంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత అనుమానాస్పాదంగా మృతి చెందింది. ట్రైనింగ్లో భాగంగా గురువారం రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు శ్వేత. ఆ తర్వాత తన గదికి వెళ్లి రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తెల్లవారే సరికి డాక్టర్ శ్వేత విగత జీవిగా కనిపించడం కలకలంగా మారింది.
కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత గౌనిక్ విభాగంలో పీజీ చేస్తూ నిజామాబాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి రెండు గంటల వరకు ఆమె డ్యూటీలోనే ఉన్నారు. అనంతరం తన గదిలో పడుకున్నారు. శుక్రవారం ఉదయం చూసేసరికి ఆమె మృతి చెందారు. ఆమె గుండెపోటుతోనే మృతి చెందినట్లు చెబుతున్నారు.
గుండెపోటుతోనే మరణించారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, అప్పటి వరకు తమతోపాటు కలిసి పనిచేసిన వైద్యురాలు హఠాన్మరణంతో తోటి జూనియర్ వైద్యులు విషాదంలో మునిగిపోయారు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ మాట్లాడుతూ.. డాక్టర్ శ్వేత చాలా చలాకీగా ఉండేవారని, ఆమెలో ఎప్పుడు కూడా డిప్రెషన్ వంటివి చూడలేదని అన్నారు. శ్వేత మరణం చాలా బాధాకరమని అన్నారు. డాక్టర్ శ్వేత అంతకుముందు రోజు రాత్రి స్నేహితులకు జ్యూస్ పార్టీ కూడా ఇచ్చిందని, అంతలోనే ఆమె మరణించడం విచారకరమని అన్నారు. శ్వేత మృతి చెందిందన్న వార్తతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.