పెళ్లింట విషాదం.. వరుడి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి,కన్నీరుమున్నీరైన వధువు...
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తుర్లపాడు-కొనకమిట్ల మండలాల సరిహద్దు గ్రామమైన కలుజువ్వలపాడు సమీపంలోని హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... త్రిపురాంతకం మండలం సోమేపల్లికి చెందిన యువతికి,పొదిలి మండలంలోని అక్కచెరువుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. బుధవారం(ఆగస్టు 25) వరుడి స్వగ్రామంలో వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం వధువును తీసుకుని కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున సోమేపల్లి నుంచి అక్క చెరువుకు బొలెరో వాహనంలో బయలుదేరారు.

మార్గమధ్యలో బొలెరో వాహనం వెనుక డోర్ తెరుచుకుంది. దీంతో వెనుక సీట్లలో కూర్చొన్నవారు కిందపడిపోయారు. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను శ్రీను, అనిల్, సుబ్బారావు, కార్తీక్లుగా గుర్తించారు. వధువు ముందు వైపు సీట్లో కూర్చోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది.
ప్రమాదం కారణంగా ఇవాళ జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. సంఘటనా స్థలంలో వధువు కన్నీరు పెట్టిన తీరు స్థానికులను కలచివేసింది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పెళ్లి జరగాల్సిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ బొలెరో వాహనం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో టైర్ పేలి అదుపు తప్పగా... అటుగా వస్తున్న లారీ వేగంగా దాన్ని ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనంలో ఉన్న నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.మందస మండలం బైరిసారంగిపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.ప్రమాద ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ఉన్న నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రయాణిస్తున్న కారు టైరు పేలి మృత్యువాత పడ్డారన్న విషయం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications