పవన్ జనసేనకు మరో షాక్: సీనియర్ నేత ఆకుల రాజీనామా, వైసీపీలోకేనా?
విజయవాడ: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి సీనియర్ నేతలు ఒక్కొరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పుటికే రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దెపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు లాంటి నేతలు జనసేనను వీడారు.

ఆకుల రాజీనామా..
తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ కూడా రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆకుల సత్యనారాయణ చివరకు జనసేనను వీడాలని నిర్ణయించుకున్నారు. తన రాజీనామా పత్రాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాన్కు పంపించారు.

తగిన ప్రాధాన్యం?
గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జనసేనలో తగిన ప్రాధాన్యం లేకపోవడం, భవిష్యత్ ప్రశ్నార్థకంగా కనిపిస్తుండటంతోనే ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది.

ఆకుల బాటలో మరికొందరు..
కాగా, ఆకుల సత్యనారాయణ బాటలోనే మరికొంతమంది నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతోపాటు కలిసి పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటును గెలుచుకోవడం గమనార్హం. ఇప్పటికే జనసేన పార్టీని వీడిన కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కావలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ కూడా ఆగస్టు 1న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆకుల చూపు బీజేపీ వైపా.. వైసీపీలోకా..?
ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి జనసేన పార్టీలో చేరిన ఆకుల సత్యనారాయణ మళ్లీ బీజేపీలోనే చేరతారా? లేక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో చేరతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ నుంచి కీలక నేతలు వెళ్లిపోతున్నప్పటికీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ, కీలక నేత నాదెండ్ల మనోహర్ గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications