సర్ అర్థర్ కాటన్ స్ఫూర్తితో పోలవరం పూర్తి: కృష్ణాడెల్టాలో 44 వేల కోట్ల పంట దిగుబడి
అమరావతి: అపర భగీరథునిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం పొందిన సర్ అర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. బుధవారం ఉదయం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కాటన్ ఆయన చేసిన సేవలను కొనియాడారు. నీటి విలువ, గొప్పదనం తెలిసిన అపర భగీరథుడు కాటన్ను స్ఫూర్తిగా తీసుకుని తాను అనేక జల వనరుల ప్రాజెక్టులను చేపట్టానని అన్నారు.

కాటన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నీరు-ప్రగతి, లాంటి జలసంరక్షణ ఉద్యమాలు ప్రారంభించామని అన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు నిత్యం కాటన్ పేరును స్మరించుకుంటాయని అదే స్ఫూర్తితో దశాబ్దాలుగా కలగా మిగిలి పోయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే 70 శాతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తిచేశామని అన్నారు.

జూలై నుంచి గ్రావిటీ ద్వారా నీటిని పారిస్తామని చెప్పారు. పోలవరం పూర్తయితే రాష్ట్ర దశ, దిశ మారిపోతుందని అన్నారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం కల నిజం చేశామని, దీనిద్వారా కృష్ణా డెల్టాలో 44 వేల కోట్ల రూపాయల విలువైన పంట దిగుబడి సాధించబోతున్నామని చంద్రబాబు తెలిపారు. తన అయిదేళ్ల పదవీ కాలంలో రాష్ట్రంలో 23 జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేశానని చెప్పారు.












Click it and Unblock the Notifications