సొంతగూటికి చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్: వైసీపీని సవాల్ చేస్తామని వ్యాఖ్యలు
రాజమహేంద్రవరం: మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తిరిగి సొంత గూటికి చేరారు. సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ ఊమెన్ చాందీ హర్షకుమార్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వంలో తిరిగి పనిచేయబోతున్నందుకు గర్వంగా ఉందన్నారు. తప్పిపోయిన కుమారుడిని తండ్రి హత్తుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ తనను హత్తుకుందని హర్షకుమార్ వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీ లాంటి నాయకురాలిని ఇంతవరకు చూడలేదని అన్నారు హర్షకుమార్. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఖబడ్దార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితులు ఉన్నాయని ఈ మాజీ ఎంపీ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
Recommended Video
ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేస్తోందని హర్షకుమార్ ఆరోపించారు. బీజేపీపై పోరాటంలో వైసీపీ, టీడీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఏపీ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని హర్షకుమార్ అన్నారు.