రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు: చంద్రబాబుతో భేటీపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత టీ కప్పులా తుఫానులా ముగిసిన విషయం తెలిసిందే. పార్టీలో పలు పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన బుచ్చయ్య చౌదరి టీడీపీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, అధినేతతో భేటీ తర్వాత పూర్తిగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు బుచ్చయ్య చౌదరి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి శనివారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు. మరోవైపు అధికార వైసీపీపై విమర్శలు కూడా ఎక్కుపెట్టారు. పార్టీలో లోటుపాట్లను చంద్రబాబుకు రాతపూర్వకంగా తెలియజేశానని తెలిపారు.

ఇతర ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలని చంద్రబాబుకు సూచించినట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని.. అందరితో కలిసి ముందుకు వెళ్లాలని సూచించినట్లు చెప్పారు. పెన్షన్ లబ్ధిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని విమర్శించారు. లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాల పింఛన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే కేంద్రం పోలవరం అంచనాలు రూ. 55వేల కోట్లకు కేంద్రం అంగీకరించలేదని బుచ్చయ్య ఆరోపించారు. పోలవరం నిర్వాసితుల ఇళ్లకు 25 రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి.. రెండు సౌకర్యాలు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రెండేళ్లలో 9వేల కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ ఛార్జీలు ప్రజల నుంచి వసూలు చేశారని విమర్శించారు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసుల విధానం మానకపోతే డీజీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు బుచ్చయ్య చౌదరి.
పార్టీ లోటుపాట్లపై అధినేత చంద్రబాబుకు స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. పార్టీ ఎలా పోరాటం చేయాలనేదానిపై చర్చించామన్నారు. కార్యకర్తల మనోభావాలను గుర్తించాలని, పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించినట్లు తెలిపారు. పార్టీలోకి వచ్చేవాళ్లు.. పోయేవాళ్లు ఎక్కువయ్యారని అన్నారు. సామాజికంగా పార్టీ బలోపేతం కావాల్సి ఉందని సూచించినట్లు తెలిపారు.
కాగా, గత గురువారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు గోరంటల్ బుచ్చయ్య చౌదరి చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గౌరవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. పార్టీలో నెలకొన్న కొన్ని పరిస్థితుల కారణంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, ఆ మాట వాస్తవమేనని చెప్పారు బుచ్చయ్య చౌదరి, అయితే, ఎంతో మంది మిత్రులు, అభిమానులు రాజీనామా చేయొద్దని కోరినట్లు తెలిపారు. పార్టీకి సంబంధించి తన అభిప్రాయాలను చంద్రబాబుకు స్పష్టంగా చెప్పినట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. కార్యకర్త మనోభావాలను టీడీపీ అధినేతకు వివరించినట్లు ఆయన వెల్లడించారు.
Recommended Video
స్థానిక ఉన్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనిట్లు ఆయన తెలిపారు. ఎవరినీ బెదిరించడానికో.. పదవుల కోసం తాను అసంతృప్తి వ్యక్తం చేయలేదని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. పార్టీ కోసమే తన తపన అని వ్యాఖ్యానించారు. పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం జరగాలని బుచ్చయ్య అన్నారు. పార్టీలో లోటుపాట్లు ఏమైనా ఉంటే చర్చించుకుంటాం.. సరిదిద్దుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమబాటలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. ఉన్నంత కాలం పార్టీకి సేవ చేస్తానని చెప్పారు. తనకు అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలకు బుచ్చయ్య చౌదరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications