అడవిలో సీఎం కేసీఆర్.. అధికారులకు దిశానిర్దేశం..!
సిద్దిపేట : సీఎం కేసీఆర్ అడవి బాట పట్టారు. గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని సింగాయపల్లి, నెంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. కలెక్టర్లను వెంటబెట్టుకుని క్షేత్రస్థాయి అటవీ ప్రాంత పర్యటనకు వెళ్లిన కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావిస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాంతాల్లో అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు కేసీఆర్ స్వయంగా చూపిస్తూ ఇతర చోట్ల అనుసరించాల్సిన విధానాలను వివరించారు.
సింగాయపల్లి అటవీ ప్రాంతంలో దాదాపు 45 నిమిషాల పాటు కలెక్టర్లను వెంటబెట్టుకుని తిరిగారు కేసీఆర్. వీరి వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ పర్యటనలో సహజ అడవుల పునరుత్పత్తి విధానంపై జిల్లా అధికారులు వివరించారు.
కేటీఆర్ వర్సెస్ నడ్డా.. మధ్యలో రాములమ్మ.. అందుకేనా ఎంట్రీ..!
కోమటిబండ పర్యటనలో సీఎం కేసీఆర్ హుషారుగా కన్పించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అంశాలపై వారికి వివరించారు. అంతేకాదు వారితో దాదాపు రెండు గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగాయపల్లి, కోమటిబండ అటవీ ప్రాంతాల్లో వందల ఎకరాల్లో నాటిన మొక్కల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో లక్ష మొక్కలు నాటాలని.. వాటి సంరక్షణ బాధ్యతలు కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు కేసీఆర్. ప్రతి గ్రామంలో అటవీభూముల్లో విరివిగా మొక్కలు పెంచాలని సూచించారు. మొక్కల పెంపకానికి కావాల్సిన నిధులు సమకూర్చడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. దానికోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
మొక్కల పెంపకంలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అంతేకాదు కలెక్టర్ల సమావేశంలో భాగంగా మిషన్ భగీరథ, హరితహారం పథకాలపై వివరంగా దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.