సినిమాలో సీన్ కోసం స్వయంగా చేపల వేటకు వెళ్లాడు: దటీజ్ నాగ చైతన్య
శ్రీకాకుళం: అక్కినేని నాగ చైతన్య తన తదుపరి సినిమా కోసం సన్నద్ధమౌతోన్నాడు. దీనికోసం శ్రీకాకళం జిల్లా మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తోన్నాడు. మత్స్యాకారుల వారి జీవితాల్లో సంభవించిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. చందు మొండేటి దర్శకుడు. బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించనున్నారు.
నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానిస్టేబుల్ శివ రోల్లో మెరిశాడు చైతు. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించిందనేది టాక్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తన కొత్త సినిమా కోసం కసరత్తు చేస్తోన్నాడు.

చేపల వేటకు వెళ్లి.. భారత సముద్ర జలాలను దాటుకుని పాకిస్తాన్లో అడుగుపెట్టిన మత్స్యకారుడిగా తన కొత్త సినిమాలో కనిపించబోతోన్నాడు నాగ చైతన్య. చందు మొండేటి, బన్నీ వాసు, కొందరు టెక్నీషియన్లతో కలిసి మత్స్యకార గ్రామాల్లో కలియ తిరిగాడు. వారి స్వీయ అనుభవాలను అడిగి తెలుసుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా షూటింగ్ జరుపుకోనుంది మూవీ.

2018లో గుజరాత్ విరావల్ నుంచి చేపల వేటకు వెళ్లిన 21 మంది మత్స్యకారులు పొరపాటున భారత సముద్ర జలాలను దాటుకుని పాకిస్తాన్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వారిని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ బంధించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సంప్రదింపులు ఫలించడంతో వారందరినీ పాకిస్తాన్ విడిచిపెట్టింది.
వారి కథను ఆధారంగా తీసుకునే నాగ చైతన్య తన నెక్స్ట్ మూవీలో నటించబోతోన్నాడు. పాక్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కిన మత్స్యకారుల్లో ఒకరైన మత్స్యలేశం గ్రామానికి చెందిన గణగల్ల రామరావును కలిశాడు ఆయన అనుభవాలను తెలుసుకున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య గణగల్ల రామరావు క్యారెక్టర్లో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఇవ్వాళ- మత్స్యకారులతో కలిసి సముద్రంపై చేపల వేటకు వెళ్లాడు నాగ చైతన్య. స్వయంగా ఫిషింగ్ బోటును నడిపాడు. తన కొత్త సినిమాలో ఫిషింగ్ బోటును నడిపించే సన్నివేశాలు ఉన్నందున దాన్ని నడపడంలో మెళకువలను తెలుసుకున్నాడు. సుమారుగా అయిదు నాటికన్ మైళ్ల దూరం వరకు ఈ ఫిషింగ్ బోటును నడిపాడు చైతూ.

సినిమాను రియలిస్టిక్గా తెరకెక్కించే ప్రయత్నాల్లో భాగంగా మత్స్యకారుల దినచర్యను అణువణువు నిశితంగా పరిశీలిస్తోన్నాడు నాగ చైతన్య. నాడు. సినిమాను సహజంగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో మత్స్యకారులతో కలిసి కొన్ని రోజుల పాటు నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి మత్స్యాకర గ్రామాల్లోనే గడపనున్నారు.












Click it and Unblock the Notifications