అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే- జరిగేది అదే: ధర్మాన సంచలనం
శ్రీకాకుళం: జిల్లాలోని రణస్థలంలో జనసేన పార్టీ నిర్వహించిన యువ శక్తి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు, ఆరోపణలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు తప్పుపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గానీ, తమ పరిపాలనను గానీ విమర్శించే హక్కు, అర్హత పవన్ కళ్యాణ్కు లేదని అన్నారు. ఉత్తరాంధ్రకు ఏం చేయాలో చెప్పకుండా.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న తమ ప్రభుత్వాన్ని తప్పుపట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.

ఉత్తరాంధ్ర బాగుపడుతుంటే..
దశాబ్దాల కాలంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడటం పవన్ కల్యాణ్ కు ఇష్టం లేదా? అని ధర్మాన ప్రసాద రావు నిలదీశారు. ఆయన చెప్పే మాటలకు చేతలకు ఎక్కడా పొంతన ఉండట్లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడి ప్రజలనే విమర్శించే సాహసం చేశారని పేర్కొన్నారు. విశాఖపట్నాన్ని రాజధానిగా అడ్డుకుంటోన్న కొద్దిమంది రియల్టర్ల తరఫున పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు.

పుస్తకాలు చదివానంటాడు..
పవన్ కళ్యాణ్ తాను రెండు లక్షల పుస్తకాలు చదివాను అంటున్నాడు గానీ.. ఆయా పుస్తకాల్లోని భావజాలాన్ని ఒంటపట్టించుకున్నట్లుగా కనిపించట్లేదని ధర్మాన ఎద్దేవా చేశారు. శ్రీశ్రీ కలలు గన్న సమ సమాజాన్ని, సమాన అభివృద్ధిని సాక్షాత్కారం చేయడానికి జగన్ కృషి చేస్తోన్నారని, ఆయన అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి ఫలాలు ఎవరికి చేరుతున్నాయో కనీసం ఆ విషయమైనా పవన్ కు తెలుసా? అని ప్రశ్నించారు. శ్రీశ్రీ చెప్పిన విధంగా బాధాతప్త హృదయాలతో ఉన్న వారికి సంక్షేమ ఫలాలను సగౌరవంగా అందిస్తోన్నారని చెప్పారు.

ఆ కమిటీలు చెప్పిందదే..
రాష్ట్రం విడపోక ముందు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పవన్ ఏనాడైనా అధ్యయనం చేశారా? అని ధర్మాన నిలదీశారు. శ్రీకృష్ణ కమిటీ గానీ, శివరామకృష్ణ కమిటీగానీ అభివృద్ధి వికేంద్రీకరణకే మద్దతు పలికిందని గుర్తు చేశారాయన. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పాలన రాజధానిగా విశాఖను చేయాలని నిర్ణయించామని పునరుద్ఘాటించారు. అమరావతిని రాజధానిగా చేస్తే- ఉత్తరాంధ్ర మళ్లీ ఓ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్ధానంలో
ఉద్ధానం అభివృద్ధికి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటోన్న కిడ్నీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టులను చేపట్టామని ధర్మాన అన్నారు. భావనపాడు పోర్టు కోసం ఇప్పటికే భూ సేకరణ చేశామని పేర్కొన్నారు. భూముల తాకట్టు పెట్టి ఏం చేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తోన్నారని, వాటిని జగన్ పట్టుకు పోయారా అని ఎదురు ప్రశ్నలు వేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది కేంద్ర ప్రభుత్వ విధానమని, దీన్ని నిలిపివేసేలా ఎన్నో సార్లు కేంద్ర పెద్దలను కలిసి విన్నవించామని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications