చంద్రబాబు ఆదేశాల మేరకు..!!
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. మొన్నటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల భవనాల కూల్చివేతకు దిగిన కూటమి నాయకులు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులపై ఫిర్యాదులు చేస్తోన్నారు. వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. వైఎస్ఆర్సీపీని పూర్తిగా డిఫెన్స్ మోడ్లోకి పడేసేలా పావులు కదుపుతోండటం రాజకీయంగా చర్చనీయాంశమౌతోంది.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు గౌతు శిరీష.
సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకడు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఫిర్యాదు చేశారు. గత అయిదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. విమర్శలు చేసిన, ప్రశ్నించిన టీడీపీ నాయకులు, ప్రజలపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
మంత్రి పదవి దక్కించుకోవాలనే ఉద్దేశంతో నిండు అసెంబ్లీలో చంద్రబాబును కించపరిచేలా సీదిరి అప్పలరాజు విమర్శించారని గౌతు శిరీష ధ్వజమెత్తారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని, తాను సర్టిఫై చేసిన తరువాతే ఆయనను అసెంబ్లీకి అనుమతించాలంటూ అప్పలరాజు మాట్లాడారని గుర్తు చేశారు.
అసలు సీదిరి అప్పలరాజు డాక్టరేనా అంటూ ప్రశ్నించారు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగాలంటే తమలా విలువలను పుణికి పుచ్చుకోవాలని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని శిరీష సూచించారు. అంతే తప్ప ఏది పడితే అది నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించరని హితవు పలికారు.












Click it and Unblock the Notifications