వామ్మో.. సబ్ కలెక్టర్ కుటుంబానికి రేషన్ కార్డ్.. అందులో ఐఏఎస్ పేరు కూడా..
పేదల కోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నెల నెల బియ్యం.. ఇతర నిత్యావసర సరుకులు అందజేస్తుంటారు. అయితే కొందరు అర్హత లేకున్నా రేషన్ తీసుకుంటారు. ఏదో కుమ్మక్కు జరిగి ప్రభుత్వ సొమ్ము అప్పనంగా పక్కదారి పడుతోంది. ఉద్యోగులకు రేషన్ కార్డు ఉండదు. ఉన్న పింక్ రేషన్ ఉంటుంది. అంటే వారికి బియ్యం, ఇతర వస్తువులు అందజేయరు. కానీ ఓ సబ్ కలెక్టర్ కుటుంబానికి వైట్ రేషన్ కార్డు ఉండటం కలకలం రేపుతోంది. చిత్రం ఏమిటంటే అందులో సదరు ఐఏఎస్ పేరు కూడా ఉంది. దీంతో స్థానికులు ఫైరయ్యారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుద్ద పరిధిలో గల పారసంబ గ్రామానికి చెందిన రోణంకి గోపాలకృష్ణ ఐఏఎస్. ఇతను ప్రస్తుతం నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే పారసంబలో ఉంటున్న కుటుంబసభ్యులకు మాత్రం రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉండటంతో చర్చకు దారితీసింది. దీనిని స్తానికులు తప్పుపట్టారు. తమకు చెందినవీ అయితే ఏదో కారణం చెప్పి తీసివేస్తారని చెబుతారు. మరీ సబ్ కలెక్టర్ కుటుంబానికి ఎలా ఇస్తారని అడుగుతున్నారు. అందులో సబ్ కలెక్టర్ పేరు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నియమ, నిబంధనలు సామాన్యులకేనా అని అడుగుతున్నారు.
పారసంబలో ఓ వివాదస్పద స్థల పరిశీలనకు ఇటీవల తహసీల్దార్ మధుసూదన్ వచ్చారు. ఉన్నతస్థాయి అధికారి కుటుంబానికి బియ్యం కార్డు ఎలా మంజూరు చేస్తారని ప్రజలు నిలదీశారు. ఐఏఎస్ అధికారికి రేషన్ కార్డు ఇవ్వడం సమంజసం అవుతుందా అని అడిగారు. ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించడంతో తహశీల్దార్ గుక్కతిప్పుకోలేకపోయారు. విషయాన్ని ఉన్నతాధికారల దృష్టికి తీసుకెళతానని చెప్పారు.