ఈవీఎంల దుర్వినియోగం: టీఆర్ఎస్- కాంగ్రెస్ తో సహా 11 పార్టీలు : కేంద్రంపై పోరు..!!
జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అందులో భాగంగా జాతీయ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్..మరో కీలక అంశం పైన ఇప్పుడు విపక్ష పార్టీలతో కలిసి ముందుకు కదులుతోంది. ఈవీఎంల దుర్వినియోగం పైన గతంలో వినిపించిన ఆరోపణలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఇదే సమయంలో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఒకే సారి 11 విపక్ష పార్టీలు కేంద్రం పైన పోరుకు సిద్దమయ్యాయి.
మూడు తీర్మానాలు ఆమోదం
ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పోరు సాగుతున్నా.. ఢిల్లీలో మాత్రం కేంద్రం పైన పోరు విషయంలో ఒకే వేదిక మీదకు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఈవీఎంలు, డబ్బు, మీడియాను బీజేపీ పావులుగా వాడుకుంటుందని ఈ పార్టీల నేతలు ఆరోపించారు. ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో 11 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్డీతో పాటు వెల్ఫేర్ పార్టీ, స్వరాజ్పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మూడు "ఎం" లను కేంద్రం ఏ విధంగా దుర్వినియోగం చేస్తోందీ.. ఎలా అడ్డుకట్ట వేయాలనే అంశం పైన చర్చించి..తీర్మానాలను ఆమోదించారు. మెషీన్, మనీ, మీడియా ను కేంద్రం తను అనుకూలంగా మలచుకొనేందుకు దుర్వినియోగం చేస్తోందని విపక్ష నేతలు మండిపడ్డారు.
మూడు "ఎం" ల దుర్వినియోగం
ఓటింగ్ విధానంలో మార్పులు తీసుకురావాలని, ఓటర్లు తాము వేసిన వ్యక్తికే ఓటు పడిందో లేదో తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని, వీవీప్యాట్ రశీదులను ఓటర్లకు ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చుపై ఆంక్షలు ఉన్నప్పటికీ పార్టీలు పెట్టే ఖర్చుపై ఎలాంటి నియంత్రణ లేదని విపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎన్నికల్లో డబ్బు ప్రమేయం విపరీతంగా పెరిగిపోయిందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేసారు. దీనిని నియంత్రించేలా మరో తీర్మానం ఆమోదించారు. ప్రజలపై తప్పుడు అభిప్రాయాలను రుద్దేందుకు బీజేపీ ప్రభుత్వం మీడియాను దుర్వినియోగం చేస్తోందని విపక్ష నేతలు మండిపడ్డారు.
ఈసీ కఠినంగా వ్యవహరించాలి
ఫేక్న్యూస్ను అరికట్టడంతో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమవుతున్నదని విపక్షాలు విమర్శించాయి. ఈ విషయంలో నేరస్తులు ఏ స్థాయిలో ఉన్నా ఈసీ కఠినంగా వ్యవహరించాలని కోరుతూ తీర్మానం చేశాయి. మొత్తం 11 పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరు కాగా.. కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్.. టీఆర్ఎస్ నుంచి సురేశ్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటుగా.. సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా(సీపీఐ), మైరాజుద్దీన్ అహ్మద్ (ఆరెల్డీ), జితేంద్ర అవధ్ (ఎన్సీపీ), డానీష్ అలీ (బీఎస్పీ), ఘన శ్యాం తివారీ (ఎస్పీ), యోగేంద్ర యాదవ్ (స్వరాజ్పార్టీ), ఇలియాస్ (వెల్ఫేర్ పార్టీ)తో పాటు పౌర హక్కుల కార్యకర్త అరుణా రాయ్ హాజరయ్యారు.