నిజాం డబ్బుల కోసం మరో న్యాయపోరాటం తప్పదా..? ఆ 120 మంది ఎవరు..?
హైదరాబాదు: ఏడవ నిజాంకు సంబంధించిన డబ్బులు ఎవరికి చెందాలన్నదానిపై ఇప్పటికే యూకే కోర్టులో వాదనలు ముగిశాయి. ఇక కొన్ని వారాల్లో తీర్పు వెల్లడించనుంది. తీర్పు పాకిస్తాన్కు అనుకూలంగా ఉంటుందా లేక భారత్కు అనుకూలంగా వస్తుందా అనేది సస్పెన్స్గా మారింది. తీర్పు పాకిస్తాన్కు అనుకూలంగా వస్తే నాట్వెస్ట్ బ్యాంకులో ఉన్న రూ.307 కోట్లు ఆ దేశానికి ఇవ్వాల్సి ఉంటుంది. అదే తీర్పు భారత్కు అనుకూలంగా వస్తే ఆ డబ్బులు మాత్రం 120 మంది పంచుకోవాల్సి ఉంటుందనేది తాజాగా వెలుగు చూసింది.
నిజాం డబ్బులు పాకిస్తాన్కు చెందాలా లేక భారత్లోని ఆయన వారసులకు చెందాలా అనేదానిపై దాదాపుగా 70 ఏళ్ల నుంచి వాదన జరుగుతోంది. ఇక వాదనలు ముగిశాయి. తీర్పు కనుక భారత్కు అనుకూలంగా వస్తే ఆ డబ్బులను నిజాం కుటుంబ సభ్యులు 120 మంది పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ మనువళ్లు అయిన ముఖరంఝా, ముఫఖం ఝాలు పంచుకుంటారని మాత్రమే తెలుసు.అయితే ఉస్మాన్ అలీ ఖాన్ మరో మనువడు నజఫ్ అలీఖాన్ కూడా హక్కుదారులైన ఇతర కుటుంబ సభ్యుల తరపున న్యాయపోరాటం చేస్తున్నారు. నిజాం వారసులకే డబ్బులు చెందాలని యూకే హైకోర్టు తీర్పు ఇస్తే ఆ డబ్బులు ఎంతమంది పంచుకోవాలనేదానిపై మరో న్యాయపోరాటం జరిగే అవకాశం ఉంది. అయితే అది భారత్లోనే జరుగుతుంది.
గత 70 ఏళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యవహారం ఒక్క తీర్పుతో అందరం సమానంగా ఈ డబ్బులను పంచుకునేలా ఉంటే బాగుంటుందని అన్నారు నిజాం రాజు మరో మనువడు నజఫ్ అలీఖాన్.ఇప్పటికే డబ్బులపై వివాదం తలెత్తడంతో నిజాం కుటుంబంలో చీలికలు వచ్చాయి.ముఖరం ఝా, ముఫఖం ఝాలు కేసును వేర్వేరుగా న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాడుతున్నారు.మరోవైపు నజాఫ్ అలీఖాన్ కూడా ఇతర కుటుంబ సభ్యుల తరపున న్యాయపోరాటం చేస్తున్నారు. ముఖరం ఝా అతని సోదరుడు ముఫఖం ఝాలు తామే వారసులు కాబట్టి డబ్బులు తమకే చెందాలంటూ పోరాడటమే కాదు... ఉస్మాన్ అలీ ఖాన్ సెటిల్మెంట్ డీడ్ పై సంతకం చేసినందున నిజమైన హక్కుదారులు తామే అని కోర్టుకు చెప్పారు.
ఇదిలా ఉంటే 1957లో కేసు అచేతన స్థితిలోకి వెళ్లిన సమయంలో తానే తిరిగి కేసును కోర్టులో ఓపెన్ చేయించినట్లు నజఫ్ అలీ ఖాన్ చెబుతున్నారు. 2008లోనే దీనికోసం చర్చలు ప్రారంభించానని ఇప్పుడున్న వారంతా 2013లో తెరపైకి వచ్చారని వాదిస్తున్నారు. మొత్తానికి నిజాం డబ్బులు భారత్కు వచ్చినా... మళ్లీ ఇక్కడ మరో సారి కోర్టుల చుట్టూ తిరగక తప్పదని స్పష్టమవుతోంది.