13 ఏళ్లు: అలిగిన ఇంటి పెద్ద, టిక్టాక్లో వీడియో, పరుగెత్తుకుంటూ వచ్చిన ఫ్యామిలీ, భావోద్వేగంతో..
చిన్న విషయంలో గొడవ.. అలకబూనిన ఇంటిపెద్ద.. ఒకటి కాదు రెండు కాదు 13 ఏళ్లు కట్టుకున్న ఆలీకి, పేగుతెంచుకొన్న బిడ్డలకు దూరంగా జీవనం. ఆత్మభిమానం చంపుకోలేక.. తిరిగి ఇంటికి వెళ్లలేక నరకయాతన.. పట్టణంలో ఏదో చిన్న పని చేస్తూ.. కాటికి కాలుచాపుతూ జీవనం... కట్ చేస్తే భార్య, పిల్లలతో కలిసిన రత్లావత్ చంద్రు. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైందనుకుంటున్నారా..? చంద్రును ఫ్యామిలీతో టిక్ టాక్ కలిపింది. అవును.. టిక్ టాక్లో వీడియో చేయడంతో.. కుటుంబసభ్యులు పరుగుతీసి వచ్చి.. అప్యాయంగా హత్తుకున్నారు.
ఇదీ నేపథ్యం..
చంద్రు స్వస్థలం.. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నేపల్లి మండలం గంగారం పెద్దతండా.. ఇతనికి పెళ్లైంది.. కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. కానీ ఏదో చిన్న విషయంలో 2007లో గొడవ జరిగింది. ఇంకేముంది కుటుంబసభ్యులతో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. తన ఊరి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ల నారాయణ పేట జిల్లా గుడిగండ్లకు వచ్చాడు. అప్పటినుంచి స్కూల్, గుడిలో ఉంటూ.. ఏదో చిన్న పనిచేస్తూ గత 13 ఏళ్లుగా జీవిస్తున్నాడు.
రామాంజనేయులు రూపంలో
అలా చంద్రు జీవితం కొనసాగుతోంది. ఈ సమయంలో రామాంజనేయులు అనే వ్యక్తి తన సొంత గ్రామం గుడిగండ్ల చేరుకున్నాడు. ఇతను హైదరాబాద్లో ఆటో నడిపించేవాడు. లాక్ డౌన్ వల్ల స్వగ్రామం వచ్చేశాడు. అయితే ఒకరోజు చంద్రు రోడ్డుపై పడుకోవడం.. రామాంజనేయులు చూశాడు. దీంతో అతని జీవితం కొత్త మలుపు తిరిగింది. ఎవరూ నీవు, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఏం చేస్తుంటావు అని ఆరాతీశాడు. రామాంజనేయులు అడిగిన ప్రశ్నలు అన్నింటినీ చంద్రు సమాధానం చెప్పాడు. వాటిని వీడియో తీసి టిక్ టాక్లో పోస్ట్ చేశాడు.
టిక్టాక్..
ఇదివరకు రామాంజనేయులు టిక్ టాక్ వాడలేదు. లాక్ డౌన్ వల్ల టైంపాస్ కోసం ఇన్ స్టాల్ చేశాడు. చంద్రు బాధను చూసి వీడియో పోస్ట్ చేశాడు. ఇంకేముంది అతను తన మామ అని ఒకరు మేసేజ్ చేశారు. మరొ తన స్నేహితుడు కూడా తనకు తెలుసు అని పేర్కొన్నారు. తర్వాత తనకు ఫోన్ చేయడంతో... తాను చెక్ చేసి... కుటుంబసభ్యుల ఫోటోలు చూపించడంతో చంద్రు గుర్తుపడ్డాడని తెలిపారు. వారితో వీడియో కాల్ చేయించడంతో.. ఆనందానికి అవధి లేకుండా పోయిందని వివరించారు.
పరుగెత్తుకుంటూ..
రెండురోజుల తర్వాత భార్య మరోని, కుమారుడు శ్రీనివాస్, కూతురు లక్ష్మీ గుడిగండ్లకు చేరుకున్నారు. తమ వెంట సర్పంచ్ను కూడా తీసుకొచ్చారు. గుడిగండ్ల ప్రజలు చంద్రుని వారి కుటుంబానికి అప్పగించారు. చంద్రు వారితో కలవడంతో.. వారు తెగ సంబరపడిపోయారని రామాంజనేయులు తెలిపారు. కానీ టిక్ టాక్ వారిని కలుపుతుందని కలలో కూడా ఊహించలేదు అని గుర్తుచేశారు. వారి కుటుంబసభ్యులు చంద్రు లేడు అని, ఇక రాడని అనుకొన్నారని చెప్పారు. మతిస్థిమితం కోల్పోయాడని.. లేదంటే చనిపోయి ఉంటారని భావించారని తెలిపారు.
హర్ట్లీ సెండాఫ్
చంద్రుకి గుడిగండ్ల ప్రజలు హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు. చంద్రుని.. కుటుంబసభ్యులకి అప్పగించినట్టు మక్తల్ ఎస్సై కూడా ధృవీకరించారు. టిక్ టాక్ చంద్రునే కాదు.. మార్చ్ నెలలో నంద్యాలలో కూడా ఒకరిని కుటుంబంతో కలిపింది. ఆరేళ్ల తర్వాత ఫ్యామిలీతో రీ యూనిట్ చేసింది.