తెలంగాణలో మరో 15 కేసులు, జీహెచ్ఎంసీలోనే 12 .. 45 మంది డిశ్చార్జ్...
తెలంగాణ రాష్ట్రంలో మరో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1122కి చేరింది. గురువారం 45 మందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన మొత్తం సంఖ్య 693కి చేరింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 400 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజు ఎవరూ కూడా చనిపోలేదు. మృతుల సంఖ్య 29గా ఉంది. కొత్తగా నమోదయ్యే కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కరోనా కలవరం: కేలం 4 రోజుల్లోనే 10వేల కేసులు నమోదు, 53వేలు దాటి..
15 కేసుల్లో జీహెచ్ఎంసీలోనే 12 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రెడ్ జోన్లో ఉన్న భాగ్యనగర పరిధిలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా ఇటీవల మీడియాముఖంగా అంగీకరించారు. వైన్ షాపులు కూడా మందు స్మగ్లింగ్ జరుగుతుందని అనుమానంతోనే తెరుస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, చెన్నైలో మిగతా షాపులను ఓపెన్ చేయగా.. అక్కడ కేసుల తీవ్రతపై ఈ నెల 15వ తేదీన రివ్యూ చేస్తామని కేసీఆర్ తెలిపారు. పరిస్థితిని బట్టి షాపులను తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
కానీ భాగ్యనగర పరిధిలో కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఇప్పట్లో షాపులు, ప్రజా రవాణాకు ప్రభుత్వం అనుమతించే అవకాశం లేదు. మిగతా 3 పాజిటివ్ కేసులు వలసకూలీలకు సోకింది. సొంత రాష్ట్రాలకు పంపించాలని వలసకూలీలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ సోకడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.