తెలంగాణలో విజృంభిస్తున్న కరోనావైరస్: కొత్తగా 1920 కేసులు, వైద్యులు, సిబ్బందికి కూడా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 83,153 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,97,775కి చేరింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4045కి చేరింది. సోమవారం కరోనా బారి నుంచి 417 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 15,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గాంధీ ఆస్పత్రికి ప్రభుత్వం కీలక ఆదేశాలు
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం నుంచి ఎమర్జెన్సీ కానీ ఆపరేషన్లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సైతం విడుదల చేసింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కానీ ఆపరేషన్లు జరగవు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గాంధీ ఆస్పత్రిలో అత్యవసర ఆపరేషన్లకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గాంధీ ఆస్పత్రిలో ఇక నుంచి కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స అందించడానికి వినియోగించే అవకాశం ఉంది.
ఆదివారం కూడా పరీక్షలు నిర్వహిస్తారు: హరీశ్
కరోనా వేళ గర్భిణులకు సర్కారు భరోసా ఇచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సర్వీసులను మాత్రమే చూడాలని ఆదేశాలున్నా కోవిడ్ బాధిత గర్భిణుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం కూడా కరోనా వాక్సినేషన్, టెస్టింగ్ చేయాలన్నారు. ఆపరేషన్ థియేటర్లు, వార్డుల కేటాయింపు ..ఇతర పాజిటివ్ బాధితులకు అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సల కోసం కూడా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడిక్కడే వారికి నాణ్యమైన చికిత్స అందించాలని, అత్యవసరం అయితేనే హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు హరీష్ రావు.
గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం
హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సిబ్బందికి, విద్యార్థులకు కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రిలో 44 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో 20 మంది మెడికోలు, 10 మంది హౌస్ సర్జన్స్, 10 మంది పీజీ స్టూడెంట్లు, నలుగురు అధ్యాపకులు ఉన్నారు. వీరందరినీ ఐసోలేషన్లలో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆస్పత్రి పని చేస్తున్న మిగతా సిబ్బందికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ హాస్పిటల్లో నాన్ కోవిడ్ అడ్మిషన్లు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో కూడా కరోనా కలకలం రేపింది.. దాదాపు 25 మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ విద్యార్థులు, మరో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది మహమ్మారి బారినపడటంతో ఇతర వైద్యులు, సిబ్బంది, రోగులు ఆందోళనకు గురవుతున్నారు.